ద్రాక్ష పంట సాగులో అధిక దిగుబడులను సాధిస్తున్నాడు మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ గ్రామా నికి చెందిన కొమ్మిరెడ్డి అంజిరెడ్డి. ఆయన గత 13 ఏండ్లుగా ద్రాక్ష తోటలను సాగు చేస్తూ మంచి దిగుబడిని సాధిస్తూ ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఏడు ఎకరాల్లో ఈ పంటను సాగు చేశారు. సాధారణంగా ఎకరానికి దాదాపుగా 17 టన్నుల దిగుబడి వస్తుందని చెబుతున్నాడు. 2010 నుంచి ద్రాక్ష సాగులో రాణిస్తున్న అంజిరెడ్డిని తెలంగాణ ప్రభుత్వం 2018లో ఉత్త మ రైతు పురస్కారంతో సత్కరించింది. మంత్రి సబితారెడ్డి ద్రాక్ష తోటను సందర్శించి అంజిరెడ్డిని అభినందించారు.
రంగారెడ్డి, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ద్రాక్ష తోటలను సాగు చేస్తూ అధిక దిగుబడులను సాధిస్తున్నాడు మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ గ్రామానికి చెందిన కొమ్మిరెడ్డి అంజిరెడ్డి. ఈయన 2018లో ఉత్తమ రైతుగా ఎంపికయ్యాడు. పండ్ల తోటల్లో మామిడి, జామ, బత్తాయి, అరటి, నారింజ మొదలైన పంటలు ఇప్పుడు సాగులో ఉన్నాయి. ఈ పంటల సాగులో కొద్దిగా శ్రమిస్తే మంచి దిగుబడినే పొందొచ్చు. అయితే ద్రాక్ష లాంటి పంటను సాగు చేసి దిగుబడిని పొందడం ఆషామాషీ వ్యవహారం కాదు. అందులోనూ దీనిని రిచ్మెన్ క్రాప్(ధనవంతుడి పంట.. ఖర్చుతో కూడుకున్నది)గా వర్ణిస్తారు. రంగారెడ్డి జిల్లాలో పదిహేనేండ్ల క్రితం ద్రాక్ష తోటల సాగు పది వేల ఎకరాల్లో ఉండగా.. ప్రస్తుతానికి 132 ఎకరాలకు పడిపోయింది.
తొలుత టోలీచౌకిలోనే సాగు..
స్వాతంత్య్రానికి పూర్వం ద్రాక్ష పండ్ల తోటలు నిజాం నవాబుల బ్యాక్ యార్డ్ (ఇంటి వెనుక గార్డెన్)లో మాత్రమే సాగయ్యేవి. అది కూడా రెండు, మూడు చెట్లు మాత్రమే కనిపించేవి. 1963 ప్రాంతంలో టోలీచౌకిలో గద్దె రామకోటేశ్వరరావు అనే వ్యక్తి తొలిసారి ఈ పంటను సాగు చేసినట్లు.. ఆ రోజుల్లో ఎకరానికి ఆరు నుంచి ఏడు టన్నుల దిగుబడి వచ్చినట్లు సమాచారం. సమశీతోష్ణ మండలంలో పండించే ఈ పంటను తొలిసారి హైదరాబాద్ పరిసరాల్లో పం డించి ఆయన చరిత్ర సృష్టించారని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకుగాను ఆయన్ను అప్పటి భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో సత్కరించిం ది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, కెన్యా, ఉగాండా దేశాలకు చెందిన వారు హైదరాబాద్కు వలసొవచ్చి పెద్ద మొత్తంలో భూములను కొనుగోలు చేసి ‘అనబిషాయి’ అనే వెరైటీ ద్రాక్షను సాగు చేశారని సమాచా రం. ఆ తర్వాత గుజరాతీలను చూసి బిర్లాలు, ఇతర ప్రాంతాలకు చెందిన ధనవంతులు కూడా ఈ పంట సాగుపై మొగ్గు చూపారు. ధనవంతులు మాత్రమే ఈ పంటను సాగు చేయడంతో దీనికి ‘రిచ్మెన్ క్రాప్’గా పేరొచ్చింది. వీరే కాకుండా ఆంధ్రా నుంచి హైదరాబాద్కు వలసొచ్చిన వారు సైతం ద్రాక్ష తోటలను సాగు చేశారు. ఈ సాగులో దిగుబడితోపాటు లాభాలు కూడా అధికంగా ఉండటంతో 1990 తర్వాత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల రైతులు కూడా దృష్టి సారించారు. 1991లో హైదరాబాద్ వేదికగా ద్రాక్ష పంటపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. అప్పట్లో నగరం ద్రాక్షకు రాజధానిగా గుర్తింపు పొందింది. ఇక్కడి రైతులను ఆదర్శంగా తీసుకొని మహారాష్ట్రలో కూడా సాగును ప్రారంభించారట. అయితే హైదరాబాద్ నగర జనజీవనం పెరుగడం, రంగారెడ్డి జిల్లాలో కమతాలు ఏర్పడి రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పడటంతో 2005 నుంచి పంట సాగు క్రమంగా త గ్గు ముఖం పట్టింది. ప్రస్తుతం మహారాష్ట్ర నుం చి ద్రాక్ష పండ్లను దిగుమతి చేసుకుంటున్నాం.
మొదట నాలుగు ఎకరాల్లో..
మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ గ్రామానికి చెందిన కొమ్మిరెడ్డి అంజిరెడ్డి 13 ఏండ్లుగా ద్రాక్ష తోటలను సాగు చేస్తున్నారు. మంచి దిగుబడిని సాధిస్తూ ఎంతోమంది రైతులకు ఆదర్శం గా నిలుస్తున్నారు. మొదట అంజిరెడ్డి 2010లో నాలుగు ఎకరాల్లో తన తోటి మిత్రులను ఆదర్శంగా తీసుకొని ఆ పంట సాగును ప్రారంభించారు.. మంచి దిగుబడితోపాటు లాభాలు కూడా వస్తుండటంతో పంటను ప్రస్తు తం ఆయన ఏడు ఎకరాల్లో ఈ పంటను సాగు చేశారు. మూడు ఎకరాల్లో పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాలేదన్నా రు. సాధారణంగా ఎకరానికి దాదాపుగా 17 టన్నుల దిగుబడి వస్తుందని.. నాలు గు ఎకరాల్లో మాత్రం (ఎకరాకు 20 నుంచి 25 టన్నుల వరకు దిగుబడి వస్తున్నదని) ఆయన సంతోషంగా చెబుతున్నారు. పంట సాగుపై ప్రత్యేక దృష్టి సారించి సాగు చేస్తున్నానని.. చీడ పీడల నివారణకు గోమూత్రాన్ని ఎరువుగా వినియోగిస్తున్నట్లు తెలిపారు.
ఎకరానికి రూ.3,50,000 ఖర్చు
ద్రాక్ష తోటల సాగుకు ఎకరానికి రూ. 3,50,000 ఖర్చు అవుతుందని అంజిరెడ్డి తెలిపారు. ఒక్కో మొక్కను రూ.150 చొప్పున మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకొని ఎకరానికి 1000 మొక్కలను నాటినట్లు తెలిపారు. ఎకరానికి 80 నుంచి 90 వరకు కడీలు, ఐరన్ వైర్, ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు.. మొక్కలకు కోతుల బెడద ఉండకుండా వలలు ఏర్పాటు చేశానన్నారు. మొక్కలకు నీటిని డ్రిప్ పద్ధతిలో అందిస్తున్నట్లు వివరించారు. అయితే, గతంలో థాంసన్ (12 ఎంఎం) వెరైటీ మొక్కలను నాటగా దిగుబడి మంచిగానే వచ్చిందని, కానీ అమ్మకాలు సరిగా లేవన్నారు. కాగా, ప్రస్తుతం మాణిక్ చమన్ (18 ఎంఎం నుంచి 22 ఎంఎం) అనే సరికొత్త వంగడాన్ని సాగు చేయగా ఎకరానికి 20 నుంచి 25 టన్నుల దిగుబడి వస్తున్నదని చెప్పారు. ఈ కొత్త తరహా వంగడాన్ని ప్రయత్నించగా ప్రతిఫలం బాగుందన్నారు. కాగా ద్రాక్ష తోటలను మంత్రి సబితారెడ్డి పరిశీలించారు. అయితే, ఈ పంట సాగుకు చిన్న, సన్నకారు రైతులు భయపడొద్దని.. ఎకరాకు రూ.3.5 లక్షలు వెచ్చించి, శ్రమిస్తే ఆశించిన దిగుబడి, ప్రతిఫలం తప్పక వస్తుందన్నారు. ఈ మొక్కను ఒక్కసారి నాటితే 20 ఏండ్ల పాటు దిగుబడిని ఇస్తూనే ఉంటుందని అంజిరెడ్డి పేర్కొన్నారు.
2018లో ఉత్తమ రైతు పురస్కారం
2010 నుంచి ద్రాక్ష సాగులో నిమగ్నమైన అంజిరెడ్డి ఎకరానికి ఆశించిన స్థాయి కంటే అధిక దిగుబడిని సాధిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను 2018లో ఉత్తమ రైతు పురస్కారంతో సత్కరించింది. అంతేకాకుండా 2014లో టమాట పంటను పదెకరాల్లో సాగు చేసి దానిలోనూ అధిక దిగుబడిని సాధించారు. కొన్ని రోజులపాటు రోజుకు వంద బాక్సుల టమాటను ఎగుమతి చేశారు. బాక్స్కు రూ.1000 చొప్పున రోజుకు రూ.లక్ష వరకు అమ్మకాలు జరిగాయి. ఈ విషయం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్కు తెలిసి ‘సక్సెస్ఫుల్ రైతు’గా అభివర్ణిస్తూ ప్రత్యేకంగా అభినందించినట్లు అంజిరెడ్డి తెలిపారు.
ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తున్నాం..
రైతులు సాగులో వస్తున్న నూతన విషయాలపై పెంచుకుని.. పంటలను పండిస్తే లాభాలను ఆర్జించొచ్చు. జిల్లాలో 2004 వరకు రెండు లక్షల ఎకరాలకు పైగానే ఉద్యాన పంటలు సాగయ్యేవి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభావంతో సాగు విస్తీర్ణం తగ్గింది. ప్రస్తుతం ఈ పంటలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ఆసక్తి గల రైతులను ప్రోత్సహిస్తున్నాం. పంటలను సాగు చేసి సక్సెస్ అయిన వారి వద్దకు రైతులను తీసుకెళ్లి వారికి పంటల సాగులో తీసుకోవాల్సిన మెళకువలను వివరిస్తున్నాం. చీడపీడల నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నాం.
– డాక్టర్ సునందారాణి; ఉద్యానవన శాఖ అధికారిణి, రంగారెడ్డి జిల్లా
ఎకరానికి రూ.3 లక్షలు మిగులుతున్నాయి
చిన్న, సన్నకారు రైతులు ఈ పంట సాగుపై భయపడొద్దు. ఈ పంటకు అవసరమైన చర్యలు తీసుకుంటే ఆశించిన దిగుబడిని సాధించొచ్చు. తాను మాణిక్చమాన్ అనే వెరైటీ మొక్కలను ఎకరానికి వెయ్యి నాటా. మొక్కల ఎంపికతోపాటు సస్యరక్షణలో చిన్న, చిన్న మెళకువలు పాటించడంతో రెండేండ్లకే అనూహ్యమైన దిగుబడి వచ్చింది. ఇప్పుడు ఒక్కో చెట్టు 25 కేజీల వరకు దిగుబడిని ఇస్తున్నది. ఎకరానికి రూ.6.5లక్షలకు పైగానే ఆదాయం వస్తున్నది. అన్ని ఖర్చులు పోనూ రూ. 3 లక్షల వరకు మిగులుతున్నది. వరి సాగుతో పోల్చుకుంటే ఈ పంటకు నీటి అవసరం కూడా పెద్దగా ఉండదు. జిల్లా అధికారుల సలహాలు, సూచనలు తీసుకుని చిన్న, సన్నకారు రైతులు ఈ పంట సాగుపై అవగాహన పెంచుకోవాలి. వాతావరణ పరిస్థితులను బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి.
– కొమ్మిరెడ్డి అంజిరెడ్డి, తుక్కుగూడ, రైతు