కోల్కతా: పశ్చిమ బెంగాల్లో సుమారు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చీలిక మొదలైంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందానికి నేతృత్వం వహిస్తున్న రితబ్రతా బెనర్జీ, టీఎంసీలో ‘ఏక్నాథ్ షిండే’గా మారారు. (Ritabrata Banerjee) ఆ పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది సభ్యుల మద్దతు తనకు ఉన్నదని పేర్కొన్నారు. బుధవారం, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి చేరుకున్న ఆయన ఈ మేరకు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా రితబ్రతా బెనర్జీని చేయాలని టీఎంసీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఇది జరిగితే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తిరుగుబాటు వర్గం అధిగమించనున్నది. తద్వారా టీఎంసీ, ఆ పార్టీ గుర్తుపై హక్కును ఆ వర్గం పొందనున్నది.
కాగా, మహారాష్ట్రలో శివసేను చీల్చిన ఏక్నాథ్ షిండే మాదిరిగా టీఎంసీలో చీలికకు కారణమైన రితబ్రతా బెనర్జీ ఒకప్పుడు వామపక్షాల కీలక నేత. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)లో విద్యార్థి కార్యకర్త స్థాయి నుంచి సీపీఎంలో రాజ్యసభ సభ్యుడిగా ఎదిగారు. వామపక్ష పార్టీకి అత్యంత ఆదరణపాత్రుడిగా పరిగణించిన ఆయనను పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా 2017లో సీపీఎం నుంచి బహిష్కరించారు.
అయితే ఆ వెంటనే 2018లో టీఎంసీలో రితబ్రతా బెనర్జీ చేరారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని ఆ పార్టీలో కీలక నేతగా ఆయన ఎదిగారు. మొదట టీఎంసీ కార్మిక సంఘ విభాగానికి నాయకత్వం వహించారు. ఆ తర్వాత రాజ్యసభ స్థానానికి నామినేట్ అయ్యారు.
మరోవైపు 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనాన్ని రితబ్రతా బెనర్జీ తట్టుకున్నారు. ఉలుబేరియా పూర్వ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా తాజాగా టీఎంసీ నుంచి ఆయనను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో పార్టీలో తిరుగుబావుటా ఎగురేసిన రితబ్రతా బెనర్జీ, బెంగాల్ ఏక్నాథ్ షిండే మాదిరిగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ మద్దతుతో టీఎంసీని చీల్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.