– బీసీ హక్కుల సాధన సమితి ధనుంజయ నాయుడు డిమాండ్
నేరేడుచర్ల, జూన్ 03 : రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చి జీఓ నంబర్ 7ను వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే పథకాన్ని కొనసాగించాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్టరేషన్లో బీసీలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయకపోవడంతో బీసీ వ్యతిరేక పార్టీగా ముద్ర వేసుకుంటున్నదన్నారు.
ఇప్పుడు ఈ జీఓ నంబర్ 7ను రద్దు చేయకపోతే రాష్ట్రంలోని బీసీ సంఘాలన్నీ ఐక్యమై బీసీ విద్యార్థుల భవిష్యత్ కోసం ఉద్యమ బాట పట్టక తప్పదన్నారు. ఇప్పటికే అనేక సందర్భాలలో బీసీ విద్యార్థులకు ఫీజు నిధులను విడుదల చేసి పేద మధ్య తరగతి వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చేయవద్దని బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేశామని అయినా ప్రభుత్వం పెడ చెవిన పెట్టడం శోచనీయమన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాక కాలేజీ యాజమాన్యాల వారు విద్యార్థులను నానా తిప్పలు పెడుతున్నారని, వారి మెమోలను టీసీలను ఇవ్వకుండా తమ దగ్గరే అట్టిపెట్టుకుంటున్నారని వారు కాలేజీలు నడిపించలేక మూసి వేసుకుంటున్నట్లు తెలిపారు.
ఇది అత్యంత ప్రమాదకరమైన విషయాన్ని ముఖ్యమంత్రి గ్రహించాలని, హైడ్రా వంటి పథకాలకు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి విద్యార్థుల ఫీజు రీయిబర్స్మెంట్ నిధులు ఒక లెక్కలోనిది కాదని, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోని బీసీ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి తక్షణమే జీఓ నంబర్ 7ను రద్దుచేసి పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని లేనియెడల తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా గౌరవాధ్యక్షుడు చిలక రాజు, శ్రీను, జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్, మండల అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షుడు పరికె భరత్, కల్లూరు సైదాచారి, మట్టపల్లి రావు, మల్లేష్, జెర్రిపోతుల వెంకటయ్య పాల్గొన్నారు.