Stock Market : భారత స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 323 పాయింట్లు నష్టపోయి 74,326 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 86 పాయింట్లు నష్టపోయి 23,396 వద్ద ముగిసింది. ఉదయం ట్రేడింగ్ నష్టాలతోనే ప్రారంభమైంది.
సెన్సెక్స్ 74,300 పాయింట్లతో, 350కిపైగా పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 100 పాయింట్ల నష్టంతో 23,400 వద్ద ప్రారంభమైంది. రోజంతా ట్రేడింగ్ నష్టాల బాటలోనే సాగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ మీటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. వారాంతం వరకు కొనసాగనుంది. దీంతో వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం వంటి అంశాల్లో ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే అంశంపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్పై నెగెటివ్ ప్రభావం చూపాయి. హార్ముజ్ జలసంధి పూర్తిగా ఓపెన్ కాకపోవడం, చమురు ధరల పెరుగుదల వంటివి కూడా మార్కెట్పై ప్రభావం చూపాయి. దీంతో అమ్మకాల ఒత్తిడి పెరిగి మార్కెట్ నష్టాల్లో ముగిసింది.
సెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐటీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్ర షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. వీటిలో టీసీఎస్ షేర్ దాదాపు 9 శాతం పతనమైంది. కోవిడ్ తర్వాత టీసీఎస్ షేర్లు ఈ స్థాయిలో పతనమవ్వడం ఇదే మొదటిసారి. పవర్గ్రిడ్ కార్పొరేషన్, ట్రెంట్, ఇండిగో, ఎస్బీఐ, ఐసీఐసీఐ షేర్లు లాభాలు చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 98 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్స్ ధర అంతర్జాతీయ విపణిలో 4,461 డాలర్ల వద్ద కొనసాగింది. డాలర్తో రూపాయి మారక విలువ 95.71గా ఉంది.