కొత్తూరు, జూలై 7 : తెలంగాణ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉండడంతోపాటు, ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందిస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తిని చూపుతున్నారు. దీంతోపాటు మధ్యాహ్నం భోజనం, పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు ఇవ్వడంతో పాటు ఖర్చు లేకుండా తల్లిదండ్రులపై ఆర్థికభారం తగ్గుతున్నది. ప్రైపేటు పాఠశాలలు వేలకు వేలు ఫీజులు గుంజుతూ నాణ్యమైన విద్యను అందించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల్లో టెన్త్, ఇంటర్ చదివిన అభ్యర్థులను ఉపాధ్యాయులుగా నియమిస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజే కాకుండా డొనేషన్లు, ట్రాన్స్పోర్ట్ పేరుతో దోపిడీ కొనసాగిస్తున్నారు. పేద, మధ్య తరగతి వారికి ప్రైవేటు చదువు భారంగా మారుతున్నది. ఇవన్నీ గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వద్దు.. ప్రభుత్వ బడులే ముద్దు అంటూ జోరుగా ప్రచారం చేస్తున్నది.
‘మన ఊరు-మన బడి’తో సకల సౌకర్యాలు..
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ బడుల్లో సకల సౌకర్యాలు సమకూరుతున్నాయి. అదనపు గదులు, విద్యుత్ సౌకర్యం, ప్రహరీ, ప్లే గ్రౌండ్ తదితర వసతులతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయి. ఈ ఏడాది 606 మంది చేరిక.. కొత్తూరు మండంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది 606 మంది కొత్త విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. చింతకుట్టతండాలో 3, ఏనుగుమడుగు తండాలో 11, గూడూరు 28, కొడిచెర్ల తండా 10, పీఎస్ కొడిచెర్ల 4, పీఎస్ కొత్తూరు 61, పీఎస్ కొత్తూరు, హెచ్/డబ్ల్యూ 21, పీఎస్ కొత్తూరు యూ/డబ్లూ 8, పీఎస్ కొత్తూరు తండా 7, పీఎస్ మక్తగూడ 7, పీఎస్ మల్లాపూర్ (హెచ్డబ్లూ) 5, పీఎస్ మల్లాపూర్ తండా 5, పీఎస్ పెంజర్ల 23, పీఎస్ ఎస్బీపల్లి 7, పీస్ సిద్దాపూర్ 16, పీఎస్ తీగాపూర్ 10, యూపీఎస్ కుమ్మరిగూడ 7, యూపీఎస్ మల్లాపూర్ 6, యూపీఎస్ తీగాపూర్ 20, యూపీఎస్ తిమ్మాపూర్ 20, జడ్పీహెచ్ఎస్ సిద్దాపూర్ 33, జడ్పీహెచ్ఎస్ గూడూరు 17, జడ్పీహెచ్ఎస్ ఇన్ముల్నర్వ 34, జడ్పీహెచ్ఎస్ కొత్తూరు 220, జడ్పీహెచ్ఎస్ పెంజర్ల (ఎస్ఎంసీ) 30 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారు.
కందవాడలో..
చేవెళ్ల రూరల్, జూలై 7 : రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు చేపట్టింది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక నిధులు మంజూరు చేయడంతో పాఠశాలల రూపు రేఖలు మారాయి. చేవెళ్ల మండల పరిధిలోని కందవాడ ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో నూతన భవనాలు, టాయ్లెట్స్, హ్యాండ్ వాష్ తదితర మౌలిక వసతులు కల్పించారు. కందవాడ ప్రాథమిక పాఠశాలకు రూ.5,96,569, కందవాడ ఉన్నత పాఠశాలకు రూ.22,89,588 నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.
జిల్లాలోనే మొదటి డైనింగ్ హాల్ నిర్మాణం..
ప్రభుత్వం మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా కందవాడ ప్రభుత్వ పాఠశాలలో రంగారెడ్డి జిల్లాలోనే మొదటగా డైనింగ్ హాల్ నిర్మాణాన్ని చేపట్టి విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ప్రారంభించారు.
ప్రత్యేక కార్యక్రమాలు, డిజిటల్ బోధన..
విద్యార్థులకు పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలతో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, డిజిటల్ బోధన తదితర వాటిపై ఉపాధ్యాయులు దృష్టి సారిస్తున్నారు. విద్యార్థులకు ఆసక్తికరమైన అంశాలపై బోధన సామర్థ్యం పెంచేలా కృషి చేస్తున్నారు.
పాఠశాల పూర్తిగా మారింది..
మన ఊరు – మన బడి కార్యక్రమంతో పాఠశాల పూర్తిగా మారింది. డ్యూయల్ డెస్క్ల ఏర్పాటు, హ్యాండ్ వాష్లు, టాయిలెట్స్ నిర్మాణాలతో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాం. గతంలో ప్రభుత్వ పాఠశాలలు అంటేనే విద్యార్థులు అనాసక్తి చూపేవారు. ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
– నరేంద్ర బోగం, ప్రధానోపాధ్యాయుడు, కందవాడ ప్రాథమిక పాఠశాల, చేవెళ్ల మండలం