HomeRangareddyState Minister Ktr Said That No Matter Where The Congress Party Is In Power There Is Nothing Wrong With It
ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా.. ఏ టు జడ్ అవినీతే..
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసుకుందామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నీళ్లివ్వలేదు..
పాలమూరు ప్రాజెక్టుతో రంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం కానున్నది..
మరోసారి పార్టీ గెలుపు కోసం కలిసి పని చేయండి
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
బీఆర్ఎస్లో చేరిన తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్
ఎంపీపీ నిర్మల, పీఏసీఎస్ చైర్మన్ కేశవరెడ్డి, 22 మంది సర్పంచ్లు, 9 మంది ఎంపీటీసీలు
ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా అక్కడ ఏ టు జడ్ అవినీతే ఉన్నదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో తలకొండపల్లి మండలానికి చెందిన జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్, ఎంపీపీ నిర్మల, పీఏసీఎస్ చైర్మన్ కేశవరెడ్డితో పాటు 22మంది సర్పంచ్లు, 9మంది ఎంపీటీసీ సభ్యులు బీఆర్ఎస్లో చేరారు. మంత్రి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నీళ్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుతో రంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం కానున్నదన్నారు.
– తలకొండపల్లి ఆగస్టు 19
తలకొండపల్లి ఆగస్టు 19 : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసుకుందామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం హైదరాబాద్లోని టీఆర్ఎస్ భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలానికి చెందిన జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్, ఎంపీపీ నిర్మల, పీఏసీఎస్ చైర్మన్ కేశవరెడ్డితో పాటు 22 మంది సర్పంచ్లు, 9 మంది ఎంపీటీసీ సభ్యులు ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కేటీఆర్ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి జడ్పీటీసీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆల్ ఇండియా ఫార్వడ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీచేసి రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద మెజార్టీతో జడ్పీటీసీగా గెలుపొందారు. మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు 9 ఎంపీటీసీలు గెలిచి ఎంపీపీ పీఠాన్ని నిర్మల చేజిక్కించుకున్నారు. అదేవిధంగా మండలంలో ప్రాథమిక సహకార సంఘం ఎన్నికల్లో పూర్తి మెజార్టీలో డైరెక్టర్లుగా గెలిచి సింగిల్ విండో చెర్మన్ పదవిని కేశవరెడ్డి చేజిక్కించుకున్నారు.
తలకొండపల్లి మండలంలో 32 సర్పంచ్లకుగాను 22 సర్పంచ్ స్థానాలను సైతం గెలుచుకున్న జడ్పీటీసీ వెంకటేశ్ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తలకొండపల్లి మండలంలో జడ్పీటీసీ వెంకటేశ్ బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో మండలం గులాబీ పార్టీతో కళకళలాడింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుద్వారా కల్వకుర్తి నియోజకవర్గంలో రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని పేర్కొన్నారు. పుట్టిన బిడ్డ నుంచి కాటికి చేరే పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, కుల వృత్తులకు చేయూత నిచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1001 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థికి లక్షాఇరవైవేల రూపాయలు ఖర్చు చేస్తూ విద్యను అందిస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉండి చేయలేని ఎన్నో పథకాలను కేసీఆర్ చేశారని చెప్పారు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అక్కడ ఏ టు జడ్ అవినీతే ఉందన్నారు. అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసిన ఘనత కేసీఆర్దని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, నాగర్కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, జడ్పీటీసీ విజితారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండల నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
బీఆర్ఎస్లో చేరిన కొత్తపల్లి యువకులు
యాచారం, ఆగస్టు 19 : బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పలు పార్టీల నుంచి 25 మంది యువకులు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై సర్పంచ్ హబీబుద్దీన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి కొండంత అండ అని పేర్కొన్నారు. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని.. దీని కోసం నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే కృషి చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడంతోపాటు అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు.
సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణలక్ష్మి, ఆసరా, ఉచిత విద్యుత్తు, రైతు బంధు, దళిత బంధు, బీసీ, మైనార్టీలకు లక్ష ఆర్థిక సాయం, గృహలక్ష్మి, రైతుబీమా తదితర పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నాయన్నారు. నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి దిశగా పయనిస్తున్నదన్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసి జిల్లాలోనే ఆదర్శంగా నిలుపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి బాషా, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లేశ్, నాయకులు లోహిత్రెడ్డి, గోపాల్, వెంకట్రెడ్డి, మణికంఠ ఉన్నారు.
ఇంటింటికీ సంక్షేమ ఫలాలు ఎమ్మెల్యే ఆనంద్
బీఆర్ఎస్లో చేరిన కోటమర్పల్లికి చెందిన వివిధ పార్టీల నాయకులు
మర్పల్లి, ఆగస్టు 19 : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రతి పల్లె అభివృద్ధితోపాటు ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం మండలంలోని కోటమర్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీల నాయకులు బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రాచయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆనంద్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు సభ్యురాలు టి.పుల్లమ్మ నాయకులు బాలకృష్ణ, రాములు యాదవ్, సురేశ్ యాదవ్, చాకలి మల్లయ్య, మాజీ వార్డు సభ్యుడు బి.పాండు, బీజేపీ నుంచి దశరథం, బీఎస్పీ నుంచి ప్రశాంత్, జైకుమార్తో పాటు ఆయా పార్టీల 70మంది నాయకులున్నారు.
గ్రామాలు మరింతగా అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్తోనే సాధ్యమని, మరోసారి సీఎం కేసీఆర్ను, ఎమ్మెల్యేగా ఆనంద్ను గెలిపించుకునేందుకు అందరం కలిసికట్టుగా పని చేద్దామని పార్టీలో చేరినవారు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు అశోక్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ రఘుపతిరెడ్డి, వార్డు సభ్యులు జైహింద్రెడ్డి, రాహుల్, మైబు, అశోక్, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు తైహసిం పాల్గొన్నారు.