Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవికి తన అభిమానులంటే ఎంతటి ప్రేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానులనే తన కుటుంబంగా భావించే ఆయన.. అవకాశం వచ్చిన ప్రతిసారీ వారి పట్ల తనకున్న ఆప్యాయతను చాటుకుంటూనే ఉంటారు. తాజాగా ‘మెగా 158’ షూటింగ్ సెట్స్లో జరిగిన ఓ అరుదైన, హృదయాన్ని హత్తుకునే సంఘటన ఇప్పుడు సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ‘మెగా 158’ షూటింగ్ సమయంలో కెమెరా విభాగంలో పనిచేస్తున్న నివాస్ అనే టెక్నీషియన్ మెగాస్టార్ చిరంజీవి దృష్టిని ఆకర్షించాడు. ఆయన పనితీరును గమనించిన చిరంజీవి.. నివాస్తో సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా అతడి వ్యక్తిగత విషయాలను అడిగి తెలుసుకున్నారు.
అప్పుడు నివాస్ తాను రామ్ చరణ్కు వీరాభిమానినని చెప్పడంతో పాటు.. చరణ్పై ఉన్న అభిమానంతో తన కుమారుడికి ‘జస్వంత్ రామ్ చరణ్’ అనే పేరు పెట్టినట్లు చిరంజీవికి తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ ఎంతో సంతోషించడమే కాకుండా.. తన కుటుంబంపై ఓ సాధారణ టెక్నీషియన్ చూపిస్తున్న అభిమానానికి భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా చిరంజీవి నివాస్ కుటుంబాన్ని తన ఇంటికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. మెగాస్టార్ నుంచి వచ్చిన ఈ ఆహ్వానం ఆ కుటుంబానికి ఊహించని ఆనందాన్ని కలిగించింది. చిరంజీవి ఆహ్వానం మేరకు నివాస్ తన కుటుంబంతో కలిసి ఆయన ఇంటికి వెళ్లారు. అక్కడ వారికి మరో మధురమైన సర్ప్రైజ్ ఎదురైంది. మెగాస్టార్తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నివాస్ కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపారు.
చిన్నారి జస్వంత్ రామ్ చరణ్తో చరణ్ ఆప్యాయంగా మాట్లాడారు. నివాస్ కుటుంబ సభ్యులతో చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలు దిగారు. మెగా ఫ్యామిలీతో గడిపిన ఈ అరుదైన క్షణాలు ఆ అభిమాని కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మారాయి. ఓ సాధారణ టెక్నీషియన్ కుటుంబానికి చిరంజీవి, రామ్ చరణ్ ఇచ్చిన గౌరవం, చూపించిన ఆత్మీయత ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నటుడు-అభిమాని మధ్య ఉండే బంధం కేవలం తెరపై ప్రేమాభిమానాలకు మాత్రమే పరిమితం కాదని.. ఇలాంటి సంఘటనలు మరోసారి నిరూపిస్తున్నాయని మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.