కోట్పల్లి, జూలై 29: గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడానైపుణ్యాన్ని పెంపొందించేందుకు.. వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందుకోసం వికారాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో క్రీడామైదానాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఒక ఎకరం ప్రభుత్వ స్థలంలో రూ. మూడు నుంచి ఐదు లక్షల వరకు వెచ్చించి సకల సౌకర్యాలతో ఏర్పా టు చేస్తున్నది. కాగా మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో 19 క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు చేపట్టగా.. ఇప్పటివరకు ఐదు గ్రామాల్లో ఎన్కెపల్లి, ఎన్నా రం, కరీంపూర్, బార్వాద్, కొత్తపల్లి గ్రామాల్లో మైదానాలు సిద్ధం కాగా మిగతా 14 క్రీడా ప్రాంగణాలు నిర్మాణ దశలో ఉన్నట్లు.. వారం రోజుల్లో వాటి పనులను పూర్తి చేస్తామని అధికారు లు పేర్కొంటున్నారు. త్వరలోనే ప్రారంభించి యువత ఆడుకునేందుకు వీలుగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ మైదానాల్లో వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, లాంగ్జంప్ వంటి ఆటలు ఆడేలా నిర్మించారు. అంతేకాకుండా మైదానాల ప్రాంగణాల పరిధిలో పచ్చదనం వెల్లివిరిసేలా మూడు వందల మొక్కలను నాటనున్నారు. ఆయా గ్రామాల్లోని నర్సరీల్లో ఉన్న నిమ్మ, కానుక, తంగేడు, చింత తదితర మొక్కలను అక్కడ నాటాలని అధికారులు భావిస్తున్నారు.
అద్భుతం.. సీఎం కేసీఆర్ నిర్ణయం
గ్రామీణ ప్రాంతాల్లోని యువత క్రీడల్లో రాణించేలా సీఎం కేసీఆర్ ప్రభుత్వం మైదానాలను ఏర్పాటు చేయడం సంతోషకరం. వీటి ద్వారా క్రీడాకారుల్లోని ప్రతిభ బయటకు వస్తుంది. ప్రభు త్వ నిధులతోపాటు, దాతల సహకారంతో క్రీడా ప్రాంగణాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామాల్లోని యువత ప్రతిభను వెలికి తీసేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అద్భుతం.
– ధర్మపురం వెంకటేశ్యాదవ్, మొత్కుపల్లి సర్పంచ్
క్రీడాప్రాంగణాల ఏర్పాటు హర్షణీయం
గ్రామాల్లో ఎకరం స్థలంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడం హర్షణీయం. గ్రామీణ ప్రాంతాల్లోని అనేక మంది యువత మైదానాలు లేకపోవడంతో ఆటలకు దూరం అవుతున్నారు. ప్రభుత్వం జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. – సురేందర్, క్రీడాకారుడు కోట్పల్లి