తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో గృహిణులు వ్యాపారాల్లో రాణిస్తున్నారు. మహిళలకు సుస్థిరమైన జీవనోపాధి కల్పించాలన్న లక్ష్యంతో ‘విలేజ్ ఎంటర్ప్రైజెస్’ను ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఎస్హెచ్జీ సభ్యులకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, గ్రామసంఘం నిధుల ద్వారా రుణాలను అందజేయడంతో మహిళలు వ్యాపారాలను ప్రారంభించి సక్సెస్ అవుతున్నారు. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 2,252 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు సుమారు రూ.20 కోట్ల రుణాలను అందజేశారు. దీంతో మహిళలు పలు వ్యాపారాలు చేస్తూ గతేడాది కాలంగా నెలకు రూ.25 వేల నుంచి రూ.లక్షకుపైగా సంపాదిస్తున్నారు. ఇందులో భాగంగా కులకచర్ల మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన శ్రీదేవి స్త్రీనిధి ద్వారా రూ.3 లక్షల రుణం తీసుకుని డ్రై ఫ్రూట్స్, మసాలాలు, శనగలు, కొబ్బరి పొడి తదితరాలను ప్యాకింగ్ చేసి విక్రయించే వ్యాపారాన్ని ప్రారంభించింది. కులకచర్ల మండలంతోపాటు దోమ మండలంలోని పలు గ్రామాల్లో సరఫరా చేస్తూ ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నది. నేడు నెలకు రూ.80 వేల వరకు సంపాదిస్తూ వ్యాపారంలో సక్సెస్ కావడం గమనార్హం.
– వికారాబాద్, ఫిబ్రవరి 7, (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): గ్రామీణ మహిళా సంఘాల సభ్యుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు వారికి సుస్థిరమైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన విలేజ్ ఎంటర్ప్రైజెస్లో భాగంగా ఆయా వ్యాపారాలు నిర్వహిస్తున్న ఎస్హెచ్జీ సభ్యులు వారి వ్యాపారాల్లో సక్సెస్ అవుతున్నారు. గతేడాది కాలంగా నిర్వహిస్తున్న వ్యాపారాల్లో సక్సెస్ ఫుల్ కావడంతోపాటు మరికొంత మందికి ఉపాధి కూడా కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంటర్ ప్రైజెస్లో భాగంగా వ్యాపారాలు మొదలుపెట్టిన స్వయం సహాయక సంఘాల సభ్యులు నెలకు రూ.25వేల నుంచి రూ.లక్షకుపైగా సంపాదిస్తున్నారు. అయితే విలేజ్ ఎంటర్ ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 2252 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారులుగా మారారు.
జిల్లాలో ఎంపిక చేసిన సంఘాల సభ్యుల్లో 80శాతం మేర స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయిలోనే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా గతేడాది నుంచి వ్యాపారాలను మొదలుపెట్టారు. అంతేకాకుండా వ్యాపారాల్లో నష్టం వాటిల్లకుండా ఎస్హెచ్జీ సభ్యులు ఎంపిక చేసుకున్న వ్యాపారాలకు సంబంధించి ప్రత్యేక శిక్షణను కూడా సంబంధిత అధికారులు ఇప్పించారు. ఎస్హెచ్జీలు ఉత్పత్తి సంబంధిత వ్యాపారాలతోపాటు వాణిజ్య, వర్తక వ్యాపారాలు, సేవా పరమైన వ్యాపారాలను ప్రారంభించారు.
సంబంధిత 2252 మందికి వ్యాపారాలను నిర్వహించుకునేందుకుగాను బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, గ్రామసంఘం నిధుల ద్వారా సుమారు రూ.20 కోట్ల రుణాల వరకు అందజేశారు. విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా ఎంపికైన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వ్యాపారం చేసేందుకుగాను ఒక్కో సభ్యురాలికి రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తున్నారు. అయితే జిల్లాలో విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా 2888 ఎస్హెచ్జీ సభ్యులను ఎంపిక చేయగా ఇప్పటివరకు 2252 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారాలను ప్రారంభించగా, మిగతా 636 మంది త్వరలోనే ప్రారంభించేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.
నాడు గృహిణి.. నేడు నెలకు రూ.80 వేల సంపాదన..
కులకచర్ల మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన శ్రీదేవి నాడు సామాన్య గృహిణి.. కానీ నేడు జిల్లాలోని ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని సరైన రీతిలో వినియోగించుకొని సక్సెస్ఫుల్ అయ్యారు. అయితే ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహంతో స్వయం సహాయక సంఘాల్లో చురుకుగా పాల్గొంటూ చిన్న, చిన్న పొదుపులు మొదలుపెట్టింది. తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన విలేజ్ ఎంటర్ ప్రైజెస్లో భాగంగా తాను వ్యాపారం చేసేందుకు ఆసక్తి చూపింది. పూర్తిగా గ్రామీణంతో కూడుకున్న కులకచర్ల మండలంలో ఏ వ్యాపారం చేస్తే సక్సెస్ అవుతామనేది కుటుంబ సభ్యులతో చర్చించి తనకు గతంలోనే అనుభవం ఉన్న డ్రై ఫ్రూట్స్, మసాలాలు, శనగలు, కొబ్బరి పొడి తదితరాలను ప్యాకింగ్ చేసి విక్రయించే వ్యాపారం మొదలుపెట్టింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో స్త్రీనిధి ద్వారా మంజూరైన రూ.3లక్షల రుణంతో ప్యాకింగ్ యంత్రాన్ని కొనుగోలు చేసింది.
ప్యాకింగ్ యంత్రంతో ఏ విధంగా ప్యాకింగ్ చేయాలనే దానిపై పదిహేను రోజులపాటు శిక్షణ కూడా తీసుకొని గతేడాదిగా తాను ప్యాకింగ్ చేసే వస్తువులను విక్రయిస్తూ లాభాలను ఆర్జిస్తుంది. గతంలో చేతితో ప్యాకింగ్ చేసి నెలకు రూ.10 వేల వరకు సంపాదించగా, ప్రభుత్వం మంజూరు చేసిన రుణంతో ప్యాకింగ్ యంత్రం సహాయంతో నేడు నెలకు రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు సంపాదిస్తుంది. తాను ప్యాకింగ్ చేసి విక్రయించే వస్తువులను గతంలో కేవలం ఒకే హోల్సేల్ దుకాణంలో విక్రయించగా, ప్యాకింగ్ యంత్రం కొనుగోలు చేసిన అనంతరం ప్యాకింగ్ చేసిన డ్రై ఫ్రూట్స్, మసాలాలు తదితరాలను కులకచర్ల మండలంతోపాటు దోమ మండలంలోని పలు గ్రామాల్లో హోల్సేల్ దుకాణాలతోపాటు గ్రామాల్లోని దుకాణాలకు సరఫరా చేస్తూ లాభాలను ఆర్జిస్తూ సక్సెస్ఫుల్గా నిలుస్తున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఆర్థిక వృద్ధి..
ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహంతో మా కుటుంబం ఆర్థికంగా బలోపేతం అయ్యింది. స్త్రీనిధి ద్వారా రూ.3 లక్షలు, రూ.50 వేల సొంత డబ్బులతో ప్యాకింగ్ యంత్రాన్ని కొనుగోలు చేసి వ్యాపారాన్ని మొదలుపెట్టాను. నేను, నా భర్త కష్టపడి గత ఏడాది కాలంగా మేం ప్యాకింగ్ చేసే డ్రై ఫ్రూట్స్ తదితరాలను కులకచర్లతోపాటు దోమ మండలాల్లోని హోల్ సేల్ దుకాణాలకు సరఫరా చేస్తున్నాం. ప్యాకింగ్ చేసి విక్రయించే డ్రై ఫ్రూట్స్, అన్ని రకాల మసాలాలను హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్నాం. గతేడాది కాలంగా ఆశించిన దాని కంటే అధిక లాభాలు వస్తుండడం సంతోషం. ఆర్థికంగా వృద్ధి చెందడంతో మా ఇద్దరు కూతుర్లు, కొడుకును హైదరాబాద్లో చదవిస్తున్నాం.
– శ్రీదేవి, పీరంపల్లి, కులకచర్ల మండలం