సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం నగరంలో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రధానంగా పెరుగుతున్న జనాభా – విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా బహుముఖ వ్యూహంతో మరింత పెద్దఎత్తున రహదారుల అభివృద్ధిని కొనసాగిస్తున్నది. ఇప్పటికే వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్.ఆర్.డి.పి) ద్వారా తొలి విడుత 47 పనుల్లో రూ.3248.53 కోట్లు వెచ్చించి 35 ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ. 3515.33 కోట్లతో చేపడుతున్న 13 చోట్ల పనులు పురోగతిలో ఉండగా.. ఈ ఏడాది చివరి నాటికల్లా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.
ఈ క్రమంలోనే దేశంలోని అన్ని మెట్రో నగరాలను సందర్శించే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, ప్రముఖులంతా హైదరాబాద్ నగరాన్ని ప్రస్తావిసూ ్త‘అన్ని నగరాల్లో కంటే హైదరాబాద్లోనే ఎక్కువ ఫ్లైఓవర్లు, అండర్పాస్ల వంటి నిర్మాణాలతో ట్రాఫిక్ ఇబ్బందులు లేవు’ అని చెబుతుండడం, సిగ్నల్ రహిత ప్రయాణంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్న దరిమిలా.. మరిన్ని రద్దీ ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని ఎస్ఆర్డీపీ రెండో దశకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రూ.4305 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ రెండో దశ ప్రతిపాదనలు సిద్ధం చేసి, ప్రభుత్వానికి అందజేసింది. జీహెచ్ఎంసీ చేపట్టబోయే ప్రాజెక్టులకు అవసరమైన నిధుల మంజూరుపై ఇటీవల మంత్రి కేటీఆర్ భరోసా ఇవ్వడం, ఈ రెండో దశ ప్రాజెక్టు పనులను పట్టాలెక్కించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రత్యేక గ్రాంటు కానీ, రుణాల గ్యారంటీపై ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని, త్వరలోనే ఎస్ఆర్డీపీ రెండో దశ పనుల ప్రారంభానికి సన్నద్ధమవుతున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.