బడంగ్పేట, మార్చి 21 : ‘పల్లెల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలే.. ఏప్రిల్ 20 లోపు రంగారెడ్డి జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలను పూర్తి చేయండి..’ అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. మంగళవారం మీర్పేట మున్సిపల్ పరిధిలోని ఎస్వైఆర్ గార్డెన్లో బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు పార్టీ పటిష్టతకు ఉపయోగపడుతాయన్నారు.
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. గడపగడపకు వెళ్లి సంక్షేమ పథకాల వల్ల కలిగే ప్రయోజనాలను తెలిపి, ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను తిప్పి కొట్టాలన్నారు. ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఏప్రిల్ 25న నియోజకవర్గాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఉంటాయని తెలిపారు. గ్రామాలు, వార్డుల్లో పార్టీ జెండాలను ఎగరవేసి, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే పార్టీ ప్రతినిధుల సభలో పాల్గొనాలన్నారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, పట్నం మహేందర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు శ్రీనివాస్ గుప్తా, లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి, కృష్ణారెడ్డి, సత్తు వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.