రంగారెడ్డి, మే 14 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాను ఓ పారిశ్రామిక హబ్గా మార్చుతున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు అని మంత్రి సబితారెడ్డి అన్నారు. అంతర్జాతీయంగా అనేక దేశాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగ ముఖ చిత్రాన్ని గుణాత్మకంగా మార్చివేసిన ‘ఫాక్స్ కాన్’ కంపెనీ శంకుస్థాపన సందర్భంగా సీఎం కేసీఆర్కు మంత్రి సబితారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి రాష్ర్టానికి భారీగా పెట్టుబడులను రప్పించడంలో మంత్రి కేటీఆర్ విజయవంతమయ్యారని మంత్రి పేర్కొన్నారు. మొదటి దశలో రూ.1656 కోట్లతో, 196 ఎకరాల్లో ఫాక్స్కాన్ సంస్థ తన ఉత్పత్తులను ప్రారంభిస్తున్నదని మంత్రి వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతి పెద్ద పెట్టుబడుల్లో ఇది అత్యంత ముఖ్యమైనదని మంత్రి పేర్కొన్నారు.
ఈ సంస్థ పూర్తి స్థాయిలో ఉత్పత్తులను ప్రారంభిస్తే లక్ష మందికి పైగా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఒకే సంస్థ ద్వారా ఇంత మందికి నేరుగా ఉద్యోగాలు లభించడం అరుదైన విషయమని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో 64 వేల కోట్ల పెట్టుబడి లక్ష్యంతో 20,000 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్న విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఫార్మా సిటీలో పూర్తి స్థాయిలో పరిశ్రమలు ఏర్పాటైతే 5.60 లక్షల మందికి ఉపాధి కలుగుతుందని మంత్రి తెలిపారు. భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తరువాత రంగారెడ్డి జిల్లాలో పారిశ్రామిక రంగానికి నవ శకం ప్రారంభమైనదని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. నూతన పరిశ్రమల స్థాపన వల్ల రంగారెడ్డి జిల్లాలోని స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నదని మంత్రి తెలిపారు. నూతన పరిశ్రమలతో రంగారెడ్డి జిల్లా రూపురేఖలు మారిపోనున్నాయని మంత్రి తెలిపారు. సోమవారం ఫాక్స్కాన్ సంస్థ శంకుస్థాపన కార్యక్రమానికి జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి కోరారు.