రంగారెడ్డి, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ):జిల్లాలోని 559 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలన శుక్రవారం నుంచి ప్రారంభమైంది. అన్ని పంచాయతీలకు కలిపి మొత్తం 252 మంది గెజిటెడ్ అధికారులకు స్పెషల్ ఆఫీసర్లుగా బాధ్యతలు అప్పగించారు. గెజిటెడ్ అధికారుల కొరతతో ఒక్కొక్కరికి రెండు, మూడు గ్రామ పంచాయతీల చొప్పున బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా పాలకవర్గాల నుంచి రికార్డులు, చెక్ బుక్కులు, డిజిటల్ సంతకాల కీలను స్వాధీనం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్తగా ఏర్పాటైన షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలోని అంతిరెడ్డిగూడ గ్రామ పంచాయతీకి సైతం స్పెషల్ ఆఫీసర్ను నియమించారు.
మొదట గెజిటెడ్తోపాటు జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, హెచ్ఎంలను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ జాబితాను రూపొందించారు. గెజిటెడ్ అధికారులనే నియమించాలని ఆ తదుపరి ఆదేశాలు ఇవ్వడంతో మళ్లీ జాబితాలో మార్పులు చేర్పులు చేశారు. తర్జనభర్జనలు పడి గురువారం రాత్రి వరకు ఎంపీడీవోలు జాబితాలను రూపొందించి డీపీవో ద్వారా కలెక్టర్కు పంపించారు. జిల్లావ్యాప్తంగా 252 మంది గెజిటెడ్ అధికారులను గుర్తించారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఎంపీవోలు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ(మిషన్ భగీరథ),
విద్యుత్ శాఖల ఈఈలు, సహాయ ఇంజినీర్లు, సమగ్ర శిశు అభివృద్ధి సేవా సంస్థ(ఐసీడీఎస్) సూపర్వైజర్లు, ఎంఈవోలు, వ్యవసాయ అధికారులు, పశు వైద్యాధికారులు, హెల్త్ సూపర్ వైజర్లు, హార్టికల్చర్ అధికారులతో జాబితాను రూపొందించారు. అయితే జిల్లాలో 559 గ్రామపంచాయతీలు ఉండడంతో గెజిటెడ్ అధికారుల కొరత ఏర్పడడంతో రెండు, మూడు పంచాయతీలను క్లస్టర్గా చేసి ఒక్కో స్పెషల్ ఆఫీసర్కు వాటి బాధ్యతలను అప్పగించారు.