వికారాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : వానకాలం సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తైంది. జిల్లా పౌరసరఫరాల శాఖ అంచనా వేసిన దానిలో 25 శాతం కూడా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాకపోవడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా 122 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రతిపాదించినప్పటికీ 120 కొనుగోలు కేంద్రాలను జిల్లా యంత్రాంగం ప్రారంభించింది. ధాన్యం కొనుగోలు సేకరణ ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 80 కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. మరో రెండు రోజుల్లో మిగిలిన కేంద్రాలనూ మూసివేయనున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. మరోవైపు ధాన్యాన్ని విక్రయించిన రైతులకు రెండు, మూడు రోజుల్లో చెల్లింపులు పూర్తి చేస్తామంటూ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వారం రోజులు దాటుతున్నా చెల్లించకపోవడంతో రైతులు డబ్బులు కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. ధాన్యాన్ని విక్రయించి పది రోజులైనా డబ్బులు ఖాతాల్లో జమ కాలేదంటున్నారు. కొనుగోలు కేంద్రాల సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు 93.97 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించగా, రూ.18 కోట్ల చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. వానకాలం సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి మొత్తం ‘ఏ’ గ్రేడ్ రకం ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేశారు.
42,655 మెట్రిక్ టన్నుల సేకరణ..
జిల్లాలో వానకాలం సీజన్కుగాను వరి ధాన్యం సేకరణ పూర్తైంది. జిల్లావ్యాప్తంగా 120 కొనుగోలు కేంద్రాల్లో 42,655 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఐకేపీ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల ద్వారా 10,285 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 14,354 మెట్రిక్ టన్నులు, డీసీఎంఎస్ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల ద్వారా 15,896 మెట్రిక్ టన్నులు, ఎఫ్పీవోల ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల ద్వారా 2120 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని 59 రైస్మిల్లులకు ఇప్పటి వరకు 42,332 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సరఫరా చేశారు. వానకాలం సీజన్కుగాను మద్దతు ధరను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం గ్రేడ్ ‘ఏ’ రకం క్వింటాలుకు రూ.2203, సాధారణ రకం రూ.2183గా నిర్ణయించింది.
గతేడాది వరకు గ్రేడ్-ఏ రకం రూ.2060, సాధారణం రూ.2040గా ధాన్యాన్ని సేకరించారు. జిల్లాలో వానకాలం సీజన్కుగాను 80 వేల మంది రైతులు 1.33 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా, 2.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేయగా, కేవలం 42,655 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాలకు రావడం గమనార్హం. రైతులకు ఇబ్బందులు కలుగకుండా వరి సాగు చేసిన 4-5 గ్రామాలకు ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒకేరోజు రైతులందరూ ధాన్యం కొనుగోలు కేంద్రానికి రాకుండా కొనుగోలు కేంద్రం వద్ద ఐదుగురు చొప్పున రైతులుండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకొని ధాన్యాన్ని ఎప్పుడు తీసుకురావాలనేది తేదితో కూడిన టోకెన్లను అందజేసి జాగ్రత్త పడ్డారు. ఈ ఏడాది రైతులు 1.34 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, ఎక్కువగా పరిగి, కుల్కచర్ల, దోమ, బొంరాస్పేట, దౌల్తాబాద్, కొడంగల్, తాండూరు, యాలాల, ధారూరు, మర్పల్లి, కోట్పల్లి మండలాల్లో అధికంగా వరి సాగు చేశారు.