ఇబ్రహీంపట్నంరూరల్ : కరోనా సమయంలో ప్రజలకు సేవలందించటంలో ఆశ వర్కర్ల సేవలు వెలకట్టలేనివని తెరాస రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఉచితంగా అందజేస్తున్న స్మార్ట్ ఫోన్లును బుధవారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆశ వర్కర్లు చేపడుతున్న సేవలు మరింత పకడ్బందీగా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆశ వర్కర్లకు స్మార్ట్ఫోన్లను అందజేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సోకుతున్న వ్యాదులపై తీసుకోవల్సిన జాగ్రత్తలతో పాటు ఇతర సమాచారం అందించేందుకు సులువుగా ఉంటుందన్నారు. అలాగే, ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురైనా వెంటనే స్థానిక పీఎచ్సీలకు తరలించేందుకు ఆశలు ఎంతో కృషి చేస్తున్నందున వారు అందిస్తున్న సేవలు మరింత సులభతరం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
కరోనా వంటి మహమ్మారిని తేలికగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇంటింటా నిర్వహించిన జ్వర సర్వేలో ఆశ వర్కర్ల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. జ్వర సర్వేలో ఇంటింటికీ తిరుగుతూ ప్రతిఒక్కరికి కదిలిస్తూ వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తూ, జలుబు, జ్వరంతో బాధపడుతున్నవారికి ఎప్పటికప్పుడు మందులు అందజేసి కరోనాను ఆదిలోనే అంతం చేసిన ఘనత వారికే దక్కిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఎచ్వో నాగజ్యోతి, ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్, ఎలిమినేడు వైద్యాధికారి అభిరాం, వైస్ఎంపీపీ ప్రతాప్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భరత్రెడ్డితో పాటు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.