రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/పరిగి, ఫిబ్రవరి 9 : టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. చేవెళ్లలో ఎమ్మెల్సీ పి.మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, కొందుర్గులో షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఆమనగల్లులో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్, వికారాబాద్లో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, కొడంగల్, బొంరాస్పేటలలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి మండల కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు నల్ల కండువాలు, బ్యాడ్జీలు ధరించి ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలతో నిరసన ర్యాలీలు జరిపి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ తీరు పట్ల టీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుండగా కేంద్రం నుంచి నయా పైసా సాయం చేయకపోగా తెలంగాణపై విషం కక్కడం సరైంది కాదన్నారు. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఇవ్వకపోవడం, పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు నెరవేర్చడంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తూర్పారబట్టారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను మోదీ అపహాస్యం చేశారని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ఇప్పటికైనా మోదీ తన వైఖరి మార్చుకోవాలని వారు డిమాండ్ చేశారు.