పారిశ్రామిక ప్రగతిలో దూసుకెళ్తున్న ఉమ్మడి జిల్లాలో మరిన్ని పరిశ్రమలు కొలువుదీరనున్నాయి. రెండు దిగ్గజ కంపెనీలు తమ యూనిట్లను నెలకొల్పేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాయి. రూ.1,472 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ కంపెనీలకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంత్రులు సబితారెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డితో కలిసి నేడు శ్రీకారం చుట్టనున్నారు. దుస్తుల తయారీ సంస్థ కిటెక్స్ గ్రూప్ వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కులో మొదటి యూనిట్ను ఏర్పాటు చేయగా.. ఇప్పుడు రెండో యూనిట్ను 250 ఎకరాల్లో రూ.1,200కోట్లతో షాబాద్ మండలం సీతారాంపూర్లో ఏర్పాటు చేస్తున్నది. అలాగే సింటెక్స్ సంస్థ ఇప్పటికే షాబాద్ మండలంలోని చందనవెల్లిలో వెల్స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్, వెల్స్పన్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ పేరిట రెండు యూనిట్లను నెలకొల్పగా.. ప్రస్తుతం రూ.272 కోట్లతో మూడో యూనిట్ను ఏర్పాటు చేస్తున్నది. ఈ యూనిట్ల ద్వారా 11,650 మందికి ఉద్యోగ అవకాశాలు లభించ నున్నాయి.
రంగారెడ్డి, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో పర్యటించనున్నారు. చందనవెల్లి, సీతారాంపూర్లలో మంత్రి పర్యటించి రెండు పరిశ్రమల యూనిట్లకు శంకుస్థాపన చేయనున్నారు. వెల్స్పన్ గ్రూప్ కంపెనీ భాగస్వామిగా ఉన్న సింటెక్స్ రూ.272కోట్ల పెట్టుబడితో చందనవెల్లిలో మూడో యూనిట్ను ఏర్పాటు చేస్తున్నది. ఈ సంస్థ ఇప్పటికే చందనవెల్లిలో రెండు యూనిట్లను నడుపుతున్నది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్తో 650 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. మరో కంపెనీ కిటెక్స్ గ్రూప్ సీతారాంపూర్లో రెండో యూనిట్ను ఏర్పాటు చేస్తున్నది. ఈ గ్రూప్ ఇప్పటికే వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కులో మొదటి యూనిట్ను ఏర్పాటు చేసి రన్ చేస్తున్నది. తాజాగా రెండో యూనిట్ను రూ.1,200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నది. ఈ యూనిట్ ద్వారా 11వేల మందికి ఉపాధి కల్పించనుండగా ఇందులో 80 శాతం వరకు మహిళలకే ప్రాధాన్యత కల్పించనున్నారు. మంత్రి కేటీఆర్ వెంట మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డిలు వస్తున్నారు.
ఔటర్ నుంచి అరగంట ప్రయాణం.. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఐటీ కారిడార్కు చేరువ.. విస్తరిస్తున్న అంతరాష్ట్ర రహదారితో అనుసంధానం వంటి అనుకూలతల నేపథ్యంలో చేవెళ్ల వైపుగా పారిశ్రామిక వేత్తలు పరుగులు తీస్తున్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలను నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, శంకర్పల్లి మండలాల పరిధిలో 84 పరిశ్రమలు రూ.14,870 కోట్ల పెట్టుబడులతో కొలువుదీరాయి. ఇప్పటికే 55 కంపెనీలు కార్యకలాపాలను ప్రారంభించగా, 4,153 మందికి ఉపాధి లభిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఈ నియోజకవర్గంలో 49 కంపెనీలు కేవలం రూ.82.959 కోట్ల వ్యయంతో పరిశ్రమలను నెలకొల్పి 842 మందికి మాత్రమే ఉపాధి చూపాయి. స్వరాష్ట్రంలో రూ.4,136కోట్ల పెట్టుబడులతో 50 కంపెనీలు ఏర్పాటై 3,495 మందికి ఉపాధి చూపిస్తున్నాయి.
సీతారాంపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి పార్టీ శ్రేణులనుద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు. జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు మంత్రి కేటీఆర్కు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.