మాతాశిశు సంరక్షణకు తెలంగాణ సర్కార్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవించే వరకూ అనేక పథకాలతో అండగా నిలుస్తున్నది. అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం, టీకాలు, నెలనెలా వైద్య పరీక్షల కోసం ఉచిత రవాణా తదితర సౌకర్యాలు కల్పిస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవమైన మహిళలకు కేసీఆర్ కిట్ను అందించడంతోపాటు ఆడబిడ్డ పుడితే రూ.13000, మగబిడ్డ అయితే రూ.12000 ఆర్థిక సాయం వివిధ దశల్లో అందజేస్తున్నది. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లాలో 39,830 మందికి కేసీఆర్ కిట్లను అందించారు. జిల్లావ్యాప్తంగా కేసీఆర్ కిట్లు, ప్రసవాలు, రెండు దఫాల టీకాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.67.96 కోట్లకు పైగా వెచ్చించింది. కేసీఆర్ కిట్ పథకంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. తద్వారా మాతా శిశు మరణాల రేటు కూడా తగ్గింది.
రంగారెడ్డి, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అందుబాటులోకి తెచ్చింది. వివిధ రంగాల్లో ప్రజల యోగ క్షేమాలపై కసరత్తు చేస్తూ వారి సంక్షేమానికి పాటుపడుతున్నది. అందులో భాగంగానే గర్భిణుల సంక్షేమం నిమిత్తం ‘కేసీఆర్ కిట్’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. గర్భిణుల అనంతర కార్యకలాపాలపై ‘కేసీఆర్ కిట్’ పథకం పలు జాగ్రత్తలు తీసుకునేలా రూపొందించబడినది. ప్రసవం అనంతరం, తల్లీబిడ్డలకు అవసరమైన సదుపాయాలు కల్పించే ఉద్దేశంతోనే ఈ కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం చేయించుకున్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తున్నది. 2017 జూన్ 2న రాష్ట్రంలో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఐదేండ్లలో జిల్లాలో 39,830 మందికి కేసీఆర్ కిట్లను అందించారు. కేసీఆర్ కిట్లలో తల్లీబిడ్డలకు అవసరమయ్యే సబ్బులు, బేబీ ఆయిల్, బేబీ బెడ్, దోమ తెర, డ్రెస్సులు, చీరలు, హ్యాండ్ బ్యాగ్, టవల్, న్యాప్కిన్లు, పౌడర్, డైపర్స్, షాంపు, పిల్లల బొమ్మలు వంటి వస్తువులు ఉన్నాయి. మూడు నెలలకు అవసరమయ్యేలా వస్తువులను కిట్ల ద్వారా అందజేస్తున్నారు.
కేసీఆర్ కిట్లతోపాటు రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులకు ఆర్థిక సాయాన్ని సైతం అందిస్తున్నది. ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగబిడ్డ పుడితే రూ.12వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నది. గర్భం దాల్చినప్పటి నుంచి తొమ్మిదో నెల వరకు నాలుగు దశల్లో ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. 5 నుంచి 6 నెలల మధ్య ఆరోగ్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు వచ్చినప్పుడు రూ.3వేలు, ప్రసవ సమయంలో బాబు పుడితే రూ.2వేలు, పాప పుడితే రూ.5వేలు ఇస్తారు. శిశువుకు మూడున్నర నెలల్లో టీకాలు వేయిస్తే రూ.2వేలు, 9 నెలల్లో టీకాలు వేయిస్తే రూ.3వేలను బ్యాంక్ అకౌంట్లలో జిల్లా అధికార యంత్రాంగం జమ చేస్తున్నది. జిల్లాలో ఇప్పటివరకు కేసీఆర్ కిట్లు, ప్రసవాలు, రెండు దఫాల టీకాలకు రూ.67కోట్ల96లక్షల88వేలను ప్రభుత్వం వెచ్చించింది.
గర్భిణుల సంక్షేమం కోసం పలు రకాలుగా ఆలోచించి ‘కేసీఆర్ కిట్ల’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తేగా, జిల్లాలో అవగాహన ఉన్న ప్రతి కుటుంబం ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నది. జిల్లాలోని పీహెచ్సీలు – 18, సీహెచ్సీలు – 9, ఏహెచ్ – 1, డీహెచ్ – 1లలో ఇప్పటి వరకు 52,820 ప్రసవాలు జరిగాయి. కేసీఆర్ కిట్ పథకంతో మాతా శిశు సంరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చింది. గర్భిణులు ప్రభుత్వ దవాఖానలో చేరినప్పటి నుంచి ప్రసవానంతరం ఇంటికి వెళ్లే వరకు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఈ పథకం ద్వారా నమోదైన వారికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తుండటంతో పాటు అన్ని రకాల మందులను అందిస్తున్నారు. దీంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 60 శాతం వరకు ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు జరుగుతున్నాయి. తద్వారా మాతా శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. దీంతోపాటు ప్రసవం అనంతరం, అమ్మ ఒడి పథకం ద్వారా తల్లీబిడ్డలను ఇంటికి సురక్షితంగా తీసుకెళ్తున్నారు.
నేను నా మొదటి కాన్పు కోసం.. ప్రభుత్వ దవాఖానలో చేరాను. ఆలూరు పీహెచ్సీలో సుఖ ప్రసవం జరిగింది. బుధవారం పొద్దున్నే మగబిడ్డను కన్నాను. బాబు రెండున్నర కిలోలున్నాడు. అన్ని రకాల సౌలతులు ఇక్కడున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ప్రైవేట్ దవాఖానల కంటే.. ప్రభుత్వ దవాఖానలే మేలు. కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు. కిట్లో శానా వస్తువులున్నయి. వైద్య సేవలు ఎంతో బాగున్నాయి. కేసీఆర్ సారుకు నా కృతజ్ఞతలు.
నాకు నొప్పులు రాంగానే.. మా దగ్గరలో ఉన్న ఆశా కార్యకర్త సాయంతోటి ప్రభుత్వ దవాఖానకు వచ్చిన. వైద్యులు, సిస్టర్లు పరీక్షించి ఎసువంటి ఇబ్బంది లేకుండా కాన్పు చేసిండ్రు. కేసీఆర్ కిట్ కూడా ఇచ్చిండ్రు. మా బిడ్డకు కావాల్సిన వస్తువులన్నీ అందులో ఉన్నయి. నాకు పైసా ఖర్చు కాలే. మా అసువంటి పేదలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి జీవితం మొత్తం రుణపడి ఉంటం. అవసరమున్న అన్ని వస్తువులతో కిట్లు ఇయ్యడం చాలా సంతోషంగా ఉంది. ఏ సర్కారూ ఎప్పుడూ ఇచ్చినట్టు కూడా తెల్వదు.
జిల్లాలో ‘కేసీఆర్ కిట్ల పంపిణీ, అమ్మ ఒడి’ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాం. సురక్షితానికి మారుపేరైన సర్కారు దవాఖానల్లోనే గర్భిణులు ప్రసవాలు చేయించుకునేలా అన్ని రకాల సౌకర్యాలున్నాయి. దీంతో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. కేసీఆర్ కిట్ల పంపిణీ నిర్విరామంగా కొనసాగుతున్నది. ఈ పంపిణీ ఇప్పటికే దాదాపు 40వేలకు చేరుకున్నది. ఇందులో భాగంగా మాతా శిశు మరణాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ప్రసవం అయ్యాక తల్లీబిడ్డలను ఇంటి వద్ద జాగ్రత్తగా చేరవేస్తున్నాం.