దోమ,మే 23 : అన్నదాతకు ధాన్యం కొనుగోలు తిప్పలు తప్పడంలేదు. మండలంలో కొనుగోళ్లు అరకొరగానే సాగుతున్నాయి. డీసీఎంఎస్, పీఏసీఎస్, ఐకేపీల ఆధ్వర్యంలో 16 కొనుగోలు కేంద్రాలు కొనసాగుతుండగా గన్నీబ్యాగుల కొరతతోపాటు రైస్మి ల్లుల వద్ద అన్లోడింగ్ త్వరగా జరుగగపోవడం తో లారీలు, ట్రాక్టర్లు రోడ్లపైనే కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నాయి. దోమ డీసీఎంఎస్ కేంద్రంలో గన్నీ బ్యాగుల కొరత ఉందని రైతులు నిరసన తెలుపగా వికారాబాద్ అదనపు కలెక్టర్ వెంకటాచారి మంగళవారం ఆ కేంద్రాన్ని సందర్శించి త్వరలోనే గన్నీ బ్యాగులు వస్తాయని చెప్పినా ఇంకా రాలేదని.. ధాన్యాన్ని కల్లాల్లో ఉంచి ప్రతిరోజూ కాపలాగా ఉండాల్సి వస్తున్నదని పలువురు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోత్కూర్ రైస్మిల్ దగ్గర పరిగి -మహబూబ్నగర్ ప్రధాన రహదారికి ఇరువైపులా ధాన్యం లోడ్లతో లారీలు, ట్రాక్టర్లు బారులుతీరడంతో వడ్ల సంచులను దించేందుకు రెండు రోజుల సమయం పడుతున్నదని రైతులు లబోదిబో మంటున్నారు. అధికారులు స్పందించి కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చూడాలని కోరుతున్నారు.
మోత్కూర్ రైస్మిల్కు ధాన్యాన్ని తీసుకొస్తే.. అన్లోడింగ్ అయ్యేందుకు రెండు రోజుల సమయం పడుతున్నది. దీంతో లారీలు, ట్రాక్టర్లు రోడ్డుపైనే కిలోమీటర్ల మేర బారులుతీరుతుండడంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతున్నది. అధికారులు స్పందించి ఒక్కరోజులోనే ధాన్యం అన్లోడింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలి..
-వెంకటపురం వెంకటయ్య, మల్లేపల్లి, దోమ
కోతలు పూర్తై పది రోజులు దాటినా గన్నీ బ్యాగులు దొరక్కపోవడంతో ధాన్యాన్ని కల్లంలోనే ఉంచాల్సి వచ్చింది. అకాల వర్షం వస్తే పంట మొత్తం తడిచిపోయే ప్రమాదం ఉన్నది. ప్రభుత్వం స్పందించి గన్నీబ్యాగులు సరిపడా పంపిణీ చేసి.. కొనుగోళ్లు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి.
– చిన్నయ్య, రైతు, లింగనపల్లి ,దోమ మండలం