శంకర్పల్లి , జూలై 29: నగరానికి కూత వేటు దూరంలో ఉన్న శేరిగూడ గ్రామం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్నది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతినెలా కేటాయిస్తున్న పల్లెప్రగతి నిధులను సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకుని గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. పల్లెప్రగతితో గ్రామ రూపురేఖలు మారిపోయాయి.
స్థానికుల నీటి ఇబ్బందిని తీర్చేందుకు గ్రామంలో మిషన్ భగీరథ తాగు నీటి ట్యాంకును ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ స్థానికులకు శుద్ధి చేసిన తాగునీరు అందుతున్నది. అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణంతో పల్లె పరిశుభ్రంగా మారింది. అదేవిధంగా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి గ్రామానికి కొత్త కళను తీసుకొచ్చాయి. ఎటుచూసినా పచ్చదనం సంతరించుకున్నది. పల్లెప్రగతిలో భాగంగా ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులతో గ్రామంలో డంపింగ్యార్డు, కంపోస్టుషెడ్డు, ట్రాక్టర్, ట్యాంకర్, పల్లెప్రకృతివ నం, హరితహారం నర్సరీ, వైకుంఠధామం వంటి అభివృద్ధి పనుల నిర్మాణాలు పూర్తైయ్యాయి. ప్రతిరోజూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య కార్మికులు కృషి చేస్తున్నారు. వారు ఇంటింటికీ తిరిగి చెత్తాచెదారాన్ని సేకరించి ..తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు ట్రాక్టర్ ద్వారా తరలించి.. అక్కడ సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ఈ ఎరువును పల్లెప్రకృతివనం, హరితహారం నర్సరీలోని మొక్కలకు వినియోగిస్తున్నారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..
రంగారెడ్డి జిల్లాలోనే శేరిగూడను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నా. మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య గ్రామాభివృద్ధికి నిధులను కేటాయిస్తున్నారు. గ్రామంలో ఇప్పటివరకు సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం పూర్తైంది. ఐదోవిడుత పల్లెప్రగతిలో భాగంగా గ్రా మంలోని పాడుబడిన ఇండ్లను పూడ్చివేయడంతోపాటు బావులపైన ఇనుప జాలీలను ఏర్పాటు చేశాం. పల్లెను పారిశుధ్య కార్మికులు ప్రతిరోజూ శు భ్రంగా ఉంచుతున్నారు. –సత్యనారాయణ, శేరిగూడ సర్పంచ్
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి
శంకర్పల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా. ప్రభుత్వ సహకారంతో మండలంలోని అన్ని గ్రామాల్లో ఇప్పటివరకు పలు అభివృద్ధి పనులను పూర్తి చేశా. నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, సీసీ రోడ్లు, వైకుంఠధామలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణంతో గ్రామాలకు కొత్త కళ వచ్చింది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. – గోవర్ధన్రెడ్డి, ఎంపీపీ శంకర్పల్లి