షాబాద్, డిసెంబర్ 23: గొల్ల, కురుమలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెలను అందజేస్తున్నది. రంగారెడ్డిజిల్లాలో మొదటి విడుతలో 20,125 యూనిట్ల గొర్రెలు పంపిణీ చేయాల్సి ఉండగా అందులో 11,685 యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. మిగతా వారు తీసుకోలేదు. తాజాగా రెండో విడుత గొర్రెలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. రెండో విడుతలోనూ 20,125 యూనిట్ల గొర్రెలను లబ్ధిదారులకు అందించేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ఉంచారు. కొత్త ఏడాది జనవరిలో రెండో విడుత గొర్రెలను పంపిణీ చేసేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. గతంలో యూనిట్ ధర రూ.1.25 లక్షలు ఉండగా పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం యూనిట్ ధర రూ.1.75 లక్షలకు పెంచింది. ఈ డబ్బుతో ఒక పొట్టేలు, 20 గొర్రెలు ఇవ్వనున్నది.
జిల్లాలో 20,125 యూనిట్లు
రంగారెడ్డి జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 25 మండలాల్లో రెండో విడుతలోనూ 20,125 యూనిట్ల గొర్రెల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడుతలో 20,125 యూనిట్లకు గాను 11,685 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేయగా, మిగతా యూనిట్లకు సంబంధించి కొందరు తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. మరికొందరు బర్రెలు ఇప్పించాలని కోరడంతో వందశాతం పూర్తి కాలేదు. మొదట్లో యూనిట్ కింద పొట్టేలుతోపాటు 20 గొర్రెల కోసం లబ్ధిదారుడి వాటాగా రూ.31,250 డీడీల రూపంలో చెల్లిస్తే ప్రభుత్వం రూ.1.25 లక్షల విలువైన జీవాలను మంజూరు చేసింది. పెరుగుతున్న ధరలకు అనుగుణం గా ప్రభుత్వం రెండో విడుత యూనిట్ ధరను రూ.1.75లక్షలకు పెంచింది. లబ్ధిదారులు ఇకపై రూ.43,750 డీడీల రూ పంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ.10వేలతో పొట్టేలు కొనుగోలు కోసం కాగా, రూ.7500 చొప్పున 20 గొర్రెలు కొనేందుకు, మిగతా డబ్బులతో రవాణా సదుపా యం, జీవాలకు దాణా, బీమా, మందులు అందజేయనున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో గొల్ల, కురుమల హర్షం
సీఎం కేసీఆర్ ప్రభుత్వం గొల్ల, కురుమల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నది. సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తూ వారికి అండగా నిలుస్తున్నది. గతంలోని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఈ విధంగా ఆదుకోలేదని, సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేయడం సంతోషంగా ఉందని వా రు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడుతలో సబ్సిడీపై పొందిన గొర్రెలు కొంతమంది గొల్ల, కురుమల వద్ద రెం డింతలు కావడంతో వారు మంచి ఆదాయం పొందుతున్నారు. అందేకాకుండా పశుసంవర్ధ్దకశాఖ ఆధ్వర్యంలో వారికి పలు సూ చనలు, సలహాలను ప్రభుత్వం అందజేస్తున్నది. జీవాలు వ్యాధుల బారిన పడకుండా టీకాలు ఇస్తూ జాగ్రతలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నది.
రెండో విడుతలోనూ 20,125 యూనిట్లు
జిల్లాలో రెండో విడుత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. మొదటి విడుతలో 20,125 యూనిట్లకు గాను 11,685 యూనిట్ల గొర్రెల పంపిణీ జరిగింది. రెండో విడుతలోనూ 20,125 యూనిట్ల గొర్రెల పంపిణీకి అవసరమైన రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశాం. ప్రభుత్వ ఆదేశానుసారం కొత్త ఏడాది జనవరి నెలలో లబ్ధిదారులకు రెండో విడుత గొర్రెలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. గొర్రెల యూనిట్ ధర రూ.1.25 లక్షల నుంచి రూ. 1.75 లక్షలకు ప్రభుత్వం పెంచింది.
-డాక్టర్ అంజిలప్ప,జిల్లా పశుసంవర్ధ్దకశాఖ అధికారి