శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠాలపై సైబరాబాద్ పరిధిలోని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్, ముంబాయి ఇండియన్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్-23 క్రికెట్ మ్యాచ్పై బెట్టింగ్కు పాల్పడుతున్న రెండు వేర్వేరు ముఠాలకు చెందిన ఇద్దరు నిర్వాహకులను ఆర్జీఐ, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.27లక్షల 500నగదుతో పాటు 2.50లక్షల విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బుధవారం శంషాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ నారాయణరెడ్డి వివరాలు వెల్లడించారు.
ఏపీలోని భీమవరం ప్రాంతానికి చెందిన సురేశ్ హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఇతడి వద్ద నుంచి ‘కొవ్వూరు1777’ అనే యాప్ ద్వారా ఇతర సబ్ బుకీలు యాక్సెస్ పొంది వాట్సాప్, ఇతర ఆన్లైన్ యాప్ల ద్వారా ఆయా ప్రాంతాల్లో బెట్టింగ్ నిర్వహిస్తుంటారు. సురేశ్కు సబ్బుకీగా విశాఖపట్నం ప్రాంతానికి చెందిన చుండూరు జగదీశ్ నగరంలోని పుప్పాలగూడలో నివాసముంటూ క్రికెట్బెట్టింగ్కు పాల్పడుతున్నాడు. వాట్సాప్, ఇతర ఆన్లైన్ యాప్ల ద్వారా ఫంటర్లతో బెట్టింగ్ నిర్వహిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం మధురానగర్ కాలనీలోని డీఎస్ఆర్ హోటల్లో సన్రైజర్స్ హైదరాబాద్-ముంబాయి ఇండియన్స్ మ్యాచ్పై బెట్టింగ్కు పాల్పడుతుండగా విశ్వసనీయ సమాచారం అందుకున్న ఆర్జీఐఏ, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు కలిసి సంయుక్తంగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో చుండూరు జగదీశ్ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.24లక్షల 500 నగదుతో పాటు, బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.4,10,868 సీజ్ చేశారు. అంతే కాకుండా ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ పరిధిలోని ఫార్చూన్ బ్లిస్ హోటల్ కేంద్రంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నడుస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్ఓటీ బృందం స్థానిక ఆర్జీఐ పోలీసులతో కలిసి హోటల్పై దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న కూకట్పల్లికి చెందిన టి.కృపానందంను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.3లక్షల నగదు, లైన్ బోర్డు, కీప్యాడ్ ఫోన్లు 14, స్మాట్ఫోన్, ల్యాప్టాప్తో కలిసి మొత్తం రూ.5.50లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో కూడా కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో గేమింగ్ చట్టం కింద కేసు నమోదై ఉన్నదని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బెంగళూరుకు చెందిన చైతన్యరెడ్డి పరారీలో ఉన్నాడు.
సమాచారం ఇవ్వండి
క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే 9490617444 నంబర్కు సమాచారం ఇవ్వాలని డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు శంషాబాద్ జోన్ డీసీపీ నారాయణరెడ్డి, ఎస్ఓటీ డీసీపీ ఎం.ఎ.రషీద్, అదనపు డీసీపీ పి.నారాయణ పర్యవేక్షణలో జరిగిన ఈ దాడుల్లో శంషాబాద్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ బి.సత్యనారాయణ, ఆర్జీఐఏ ఇన్స్పెక్టర్ ఆర్.శ్రీనివాస్తో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.