షాద్నగర్, డిసెంబర్ 5 : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు రైతు సంక్షేమం ఆగదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. సోమవారం ఫరూఖ్నగర్ మండలం ఎలికట్ట గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన ప్రపంచ నేల దినోత్సవంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి పాల్గొని మాట్లాడారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా మన తెలంగాణ రైతులు అభివృద్ధి చెందారని, గత ఎనిమిదేండ్ల క్రితానికి.. నేటికీ ఎన్నో మార్పులు వచ్చాయని తెలిపారు. రైతులను ఎట్టిపరిస్థితిల్లోనూ ఇబ్బందిపెట్టబోమని.. బోరుబావుల వద్ద కరెంట్ మీటర్లను బిగించబోమని చెప్పారు. పక్క రాష్ట్రంలో ఇప్పటికే మీటర్ల బిగింపు ప్రారంభమైందని, సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు తెలంగాణ రైతులకు ఆ పరిస్థితి రాదని తెలిపారు.
కేంద్రం సహకరించకున్నా మన రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి సాధించిందని, నేడు షాద్నగర్ లాంటి ప్రాంతాలు వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగంలో ముందున్నాయన్నారు. ఓ ఇంట్లో కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను పొందిన కొందరు టీఆర్ఎస్ పాలన తీరును విమర్శిస్తున్నారని.. కన్న తల్లిదండ్రులకు గంజిపోయనోళ్లు తెలంగాణ సంక్షేమ పథకాలను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు చాలా సంతోషంగా ఉన్నారని, వారి చల్లనీ ఆశీర్వాదం తెలంగాణ ప్రభుత్వంపై ఉంటుందని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సీఎం కేసీఆర్ సహకారంతో పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా షాద్నగర్ ప్రాంతానికి సాగునీరు అందించి తీరుతామని పేర్కొన్నారు. స్థానిక ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎమ్మెల్యే అంజయ్యయాదవ్కు ఇక్కడి ప్రజలు అండగా ఉండాలని కోరారు.
సేంద్రియ వ్యవసాయంపై మొగ్గుచూపాలి
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ.. సారవంతమైన నేలల్లోనే పంటల దిగుబడి అధికంగా ఉంటుందని, అన్ని వర్గాల రైతులు సేంద్రియ వ్యవసాయంపై మొగ్గుచూపాలన్నారు. ఇష్టానుసారంగా రసాయ మందులు వాడరాదని, రైతు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా పంటల దిగుబడి తగ్గుతుంది, భూసారం దెబ్బతింటుందని సూచించారు. ఈ సందర్భంగా ఎలికట్ట గ్రామానికి చెందిన మహిళా రైతుకు రైతు బీమా ప్రోసిడింగ్ పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఖాజా ఇద్రీస్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, సర్పంచ్ సాయికుమార్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, ఏడీఏ రాజారత్నం, ఏవో నిషాంత్కుమార్, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ లక్ష్మీనర్సింహారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.