షాద్నగర్ : రైతు సుభిక్షమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతుల పాలిట దేవుడయ్యారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కొనియాడారు. బుధవారం ఫరూఖ్నగర్ మండలం కొండన్నగూడ గ్రామంలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో పాల్గొని మాట్లాడారు. సీఎం తన అద్భుతమైన ఆలోచనతో రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలుచేసి, ప్రతి రైతుకుటుంబానికి భరోసనిచ్చారని అన్నారు. మొదటిసారి అధికారలంలోకి రాగానే మిషన్ కాకతీయ ద్వారా గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలకు మరమ్మతులు నిర్వహించి భూగర్భ జలాల పెంపునకు తోడ్పాడ్డాని అన్నారు. గత పాలకులు ఏనాడు కూడా రైతుల శ్రేయస్సుపై దృష్టి పెట్టలేదని విమర్శించారు.
ఉమ్మడి రాష్ట్ర పాలనలో రైతు కష్టమంత బోరుమోటర్ల, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులకే సరిపోయేదని, ఏనాడు కూడా యాదర్థంగా రైతు కంటినిండ నిద్రపోలేని పరిస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల స్థితిగతులు పూర్తిగా మారాయని, దైర్యంగా తమకు ఇష్టమైన పంటలను సాగు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని చెప్పారు. రైతుబంధు పథకం ద్వారా రూ. 50వేల కోట్ల నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత దేశంలో ఏ ప్రభుత్వానికి లేదని, రైతుల గుండేల్లో సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. గ్రామంలోకి ఎమ్మెల్యే రాగనే స్థానిక నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు.
మహిళలు రైతుబంధు పేరుతో ముగ్గులు వేసి సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఖాజ ఇద్రీస్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ లక్ష్మీనర్సింహరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వెంకట్రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ గీతారెడ్డి, గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, గ్రామాల రైతులు పాల్గొన్నారు.