షాద్నగర్టౌన్ : హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ భారీ మోజార్టీతో గెలుపొందడం ఖాయమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం హుజూరాబాద్లోని పలు గ్రామాల్లో సంగీత నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబాల్నాయక్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్షగా నిలుస్తున్నాయన్నారు.
ఎవరిని పలుకరించిన సంక్షేమ పథకాలు అందుతున్నాయని, మేమందరం కారుగుర్తుకు ఓటు వేస్తామని చెబుతున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమ పథకాలను గడప గడపకు వివరించి కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో కొత్తూరు కౌన్సిలర్ శ్రీను, నాయకులు రాజు, విఠల్ పాల్గొన్నారు.