షాద్నగర్టౌన్ : తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో అందరిని భాగస్వాములను చేయాలని సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ గీతారాధిక అన్నారు. ఇందులో భాగంగానే షాద్నగర్ మున్సిపాలిటీలోని పట్టణ హరితహారం నర్సరీలను, పట్టణ ప్రకృతి వనాలను బుధవారం మున్సిపల్ కమిషనర్ జయంత్కుమార్రెడ్డితో కలిసి పరిశీలించారు. మున్సిపాలిటీలో నాటిన మొక్కలతో పాటు నర్సరీలలో ఎన్ని మొక్కలు ఉన్నాయనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా రానున్న రోజుల్లో నాటే మొక్కలకు సంబంధించి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. మొక్కలు నాటడం ద్వారా కలిగే లాభాలను ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారిని హరితహారంలో భాగస్వాములను చేయాలని సూచించారు. ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేయడంతో పాటు ప్రతి ఇంటికీ కనీసం 6 మొక్కలు నాటే విధంగా చూడలన్నారు.
మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అదే విధంగా పట్టణ ప్రకృతి, పట్టణ హరితహారం నర్సరీలను, మున్సిపాలిటీలోని పరిగిరోడ్డులోని డివైడర్ మధ్యలో నాటిన మొక్కలను చూసి ఆమె సంతృప్తి వ్యక్తం చేసినట్లు కమిషనర్ తెలిపారు.