షాద్నగర్, జనవరి 27 : షాద్నగర్ ప్రాంతం అభివృద్ధే ముఖ్యం తప్పా రాజకీయాలు తమకు అవసరం లేదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ స్పష్టం చేశారు. నియోజకవర్గంలో చేపడుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి సంపూర్ణ సహకారం ఉంటే మరింత అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని అన్నారు. శుక్రవారం షాద్నగర్ పట్టణంలోని ఫరూఖ్నగర్లో రూ. 50 లక్షలతో నిర్మిస్తున్న షాదీఖాన, రూ. 20 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు, రూ. 1.05 కోట్ల నిధులతో నిర్మిస్తున్న అంతర్గత మురుగు కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం వెచ్చించిన నిధుల తీరును ప్రజలు అందరూ గమనించాలని, ముస్లింలకు షాదీ ఖానాలను నిర్మిస్తున్నామని అన్నారు. ఫరూఖ్నగర్తో పాటు చౌదరిగూడ, కొందుర్గులలో నూతన షాదీఖానాలను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు.
మౌళిక వసతుల కల్పనలో భాగంగా అంతర్గత మురుగు కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణాలను వంద శాతం అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తామని అన్నారు. షాద్నగర్ పట్టణంలోని హైదరాబాద్, జడ్చర్ల రోడ్ల ఆధునీకరణకు ప్రజల సహాకారం అవసరమని, రోడ్డు విస్తరణ చేపడితే వ్యాపార రంగాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయవల్సిన అవసరం లేదని, అభివృద్ధే ప్రధానమని తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, నాయకులు ఈగ వెంకట్రాంరెడ్డి, చెట్ల నర్సింహ, జూపల్లి శంకర్, సయ్యద్సాధిక్, జమృత్ఖాన్, కాలనీలవాసులు, అధికారులు పాల్గొన్నారు.
బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోండి
ఫరూఖ్నగర్ పీఏసీఎస్ ద్వారా రైతులకు అందించే బ్యాంకు రుణాలను రైతులు సద్వినియోగం చేసుకొని లబ్ధిపొందాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం షాద్నగర్ పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన బ్యాంకు రుణాలు, డిజిటల్ లావాదేవీల అవగాహన కార్యక్రమంలో పాల్గొని పలువురి రైతులకు రుణాలను అందజేసిన అనంతరం మాట్లాడారు. బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించే బాధ్యత కూడా రైతులపై ఉంటుందని, డిజిటల్ లావాదేవీలపై కూడా రైతులు అవగాహన పొందాలని అన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బక్కన్న యాదవ్, జెడ్పీటీసీ పి. వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేందర్, నాయకులు మన్నె నారాయణయాదవ్, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.