తాండూరు, మే 22 : తాండూరు నియోజకవర్గంలో ధాన్యం పండించిన అన్నదాత గోస వర్ణనాతీతంగా మారింది. హమాలీలు, లారీల కొరతతో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. రైతులు ధాన్యాన్ని కల్లాల నుంచి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేందుకు అవసరమైన గన్నీ బస్తాలను కేంద్రాల సిబ్బంది ఇవ్వడంలేదు. నాలుగైదు రోజులపాటు తిరిగితే తప్ప సంచులు ఇవ్వడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. సంచుల్లేకపోవడంతో వడ్లను కల్లాల్లోనే ఆరబెట్టామని.. అకాల వర్షాలొస్తే తడిచిపోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను అధిగమించి ధాన్యాన్ని ట్రాక్టర్లలో కొనుగోలు కేంద్రాలకు లేదా మిల్లుల వద్దకు తీసుకెళ్తే అక్కడ మరిన్ని కష్టాలు ఎదుర్కొవాల్సి వస్తున్నదని రైతులు బావురుమంటున్నారు.
మిల్ల ర్లు తేమ శాతం పేరుతో క్వింటాకు 8 నుం చి 10 కిలోల వరకు తరుగు తీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యాలాల మండలంలోని లక్ష్మీనారాయణపూర్ సమీపంలోని ఓ మిల్లులో శుక్రవారం కిలోమీటరు పొడవునా ప్రధాన రహదారి పక్కన వందలాదిగా ధాన్యం ట్రాక్టర్లు అన్లోడింగ్ కోసం గంటలపాటు వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపించింది. గోనూర్, లక్ష్మీనారాయణపూర్, జుంటుపల్లి, బెన్నూరు కొనుగోలు కేంద్రాల్లో వేలాది ధాన్యం బస్తాలు తూకం వేయక పోవడంతో రైతులు కేంద్రాల ఆవరణలోనే ధాన్యం ఆరబెట్టుకుంటూ ఉండిపోతున్నారు. 10 రోజుల కిందట టోకెన్లు తీసుకున్న రైతులకు సంబంధించిన ధా న్యాన్ని మాత్రమే గోనూర్ కొనుగోలు కేంద్రంలో తూకం వేస్తున్నారు.