వికారాబాద్, ఫిబ్రవరి 19 : సద్గురు సేవాలాల్ మహరాజ్ భావాలు, ఆశయాలను అనుసరించి ప్రజలు ముందుకు సాగాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం వికారాబాద్లో సేవాలాల్ మహరాజ్ 285వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రసాద్కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుధాకర్రెడ్డిలతో కలిసి భోగ్ బండార్ పూజా కార్యక్రమంలో స్పీకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహనీయుల సందేశాన్ని అనుసరించి వారిని ఆదర్శంగా తీసుకుంటే కొంతమేరకైనా వారి దీవెనలు మనకు ఉంటాయన్నారు. మహా పురుషుల బాటలో నడిచినట్లైతే మన జీవన విధానంలో మార్పులు వస్తాయని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నదని తెలుపుతూ.. ప్రజల సహకారంతో తండాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ప్రభుత్వ రంగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. జిల్లాలో పరిశ్రమలను స్థాపించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. యువత చెడు అలవాట్లకు గురికాకుండా కుటుంబంలో ఆర్థికంగా ఎదిగేందుకు తమ పాత్ర ఉండాలని సూచించారు. జిల్లాలో పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్ది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని స్పీకర్ తెలిపారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ.. బంజారా కుటుంబాల్లో వెలుగు నింపిన సంత్ సేవాలాల్ చిరస్మరణీయులని కొనియాడారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు గ్రామాలు, తండాల అభివృద్ధికి సహకారం అందించాలని ఆమె కోరారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. చదువును ఆయుధంగా మార్చుకొని సమాజంలో అన్ని రంగాల్లో బంజారా యువత రాణించాలని సూచించారు. మహనీయులను మార్గదర్శకంగా ఎంచుకొని జాతి సమూహంలో మంచిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యా విధానంలో ఎన్నో మార్పులు తీసుకొని వస్తూ కార్పొరేట్ విద్యను అందిస్తున్నదని, ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకోవాలని కలెక్టర్ తెలిపారు.
అనంతరం గిరిజన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీవో విజయకుమారి, గిరిజన అభివృద్ధి శాఖ అధికారి కోఠాజీ, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో వినయ్కుమార్, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, సద్గురు సేవాలాల్ మహరాజ్ సంఘం కమిటీ సభ్యులు కిషన్ నాయక్, పాండూనాయక్, పరశురాంనాయక్, రెడ్యానాయక్, రాఘవానాయక్, రాములునాయక్ ఉన్నారు.