సర్వేంద్రియానం నయనం ప్రధానం.. కంటి సంరక్షణకు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.. కానీ చాలామంది పేదలు ఆర్థిక ఇబ్బందులు, నిర్లక్ష్యంతో కంటి పరీక్షలకు దూరంగా ఉంటున్నారు. దీన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ 2018లో ‘కంటి వెలుగు’కు శ్రీకారం చుట్టి ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతోపాటు చికిత్సలు అందించారు. ప్రస్తుతం మరోసారి కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టేందుకు రాష్ట్ర సర్కార్ కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో రెండో విడుత ‘కంటి వెలుగు’కు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
జనవరి 18వ తేదీ నుంచి 100 పని దినాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 75 బృందాలను ఏర్పాటు చేయగా.. వికారాబాద్ జిల్లాలో 42 బృందాలు రంగంలోకి దిగనున్నాయి. రోజుకు 350 నుంచి 400 మందికి ఐ టెస్ట్లు చేసే దిశగా వైద్యారోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలకు పైసా ఖర్చు లేకుండా కంటి పరీక్షలు చేయనున్నారు. ఆలాగే ఉచితంగా చికిత్సలు, మందులు, కండ్లద్దాల పంపిణీతోపాటు అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు సైతం చేయనున్నారు.
-రంగారెడ్డి, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి/వికారాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : సర్వేంద్రియానం నయనం ప్రదానం. కంటి సంరక్షణకు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరముంది. అయితే చాలామంది ఆర్థిక సమస్యలు, నిర్లక్ష్యంతో దూరంగా ఉంటున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించడంతోపాటు అద్దాలను పంపిణీ చేయడం, శస్త్ర చికిత్సలను నిర్వహిస్తున్నది. 2018 ఆగస్టు 18న ప్రభుత్వం ‘కంటి వెలుగు’ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ప్రభుత్వ ఖర్చులతో లక్షలాడి ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు, అవసరమైనవారికి శస్త్ర చికిత్సలు, మందులను ఈ పథకంలో భాగంగా అందజేసింది. అయితే మొదటి విడుత కంటి వెలుగు కార్యక్రమంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ‘కంటి వెలుగు’కు సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే మొదలైంది. కంటి పరీక్ష కేంద్రాల ఏర్పాటు, కావాల్సిన యంత్రాలు, వైద్యులు, వివరాలను పొందుపర్చేందుకు అవసరమయ్యే సిబ్బందిని నియమించే ప్రక్రియపై వైద్యారోగ్య శాఖ అధికారులు దృష్టి సారించారు. ప్రధానంగా శస్త్ర చికిత్సలకు ప్రాధాన్యమివ్వనున్నారు.
వంద పని దినాల్లో పూర్తయ్యేలా..
రెండో విడుత ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని వచ్చే నెల 18 నుంచి ఉమ్మడి జిల్లాలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలు నిర్వహిస్తాయి. ఈ కార్యక్రమాన్ని 100 పని దినాల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణను ఇప్పటికే డీఎంఅండ్ హెచ్వోలు చేపట్టారు. గ్రామాలు, మున్సిపల్ వార్డులవారీగా కంటి వెలుగు శిబిరాల షెడ్యూల్ను పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వైద్య శాఖ అధికారుల సమన్వయంతో సిద్ధం చేస్తున్నారు.
జనాభాకు అనుగుణంగా బృందాలు
జనాభాకు అనుగుణంగా అవసరమైన మేరకు బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి బృందంలో ఒక మెడికల్ అధికారి, ఆప్తమాలజిస్ట్, ఇద్దరు ఆశావర్కర్లు, ఇద్దరు ఏఎన్ఎంలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సీహెచ్వోలు సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యకలాపాలు, వారంలో ఐదు రోజుల పాటు కొనసాగేలా చూసుకుంటున్నారు.
కండ్లద్దాలకు బార్ కోడ్
కంటి పరీక్షలను నిర్వహించిన వెంటనే అవసరమైనవారికి వెంటనే అద్దాలను పంపిణీ చేయనున్నారు. ఈసారి పంపిణీ చేసే అద్దాలకు ప్రత్యేకంగా లబ్ధిదారుల వివరాలతో కూడిన బార్ కోడ్ ఏర్పాటు చేయనున్నారు. లబ్ధిదారులకు అందజేసే అద్దాలతో కంటి పరీక్షలు నిర్వహించే యంత్రాలు తదితరాలు ఈనెలాఖరులోగా రానున్నాయి. సర్జరీలు అవసరమైన లబ్ధిదారులకు హైదరాబాద్లోని సరోజిని దవాఖానకు పంపించనున్నారు.
వైద్యుల నియామకం వారం రోజుల్లో..
వైద్యుల నియామకం మరో వారం రోజుల్లో పూర్తి కానుంది. ఆర్బీఎస్కే వైద్యులు, ఆయుష్ వైద్యులను ఇందులో వినియోగించుకోనున్నారు. ఈ పథకంలో స్థానిక ప్రజాప్రతినిధులను ఎక్కువగా భాగస్వాములను చేయనున్నారు. షెడ్యూల్, మైక్రో ప్లానింగ్ పూర్తి చేసిన తరువాత ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్లు, మున్సిపల్ చైర్పర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో స్థానిక మంత్రి అధ్యక్షతన జిల్లాస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. కంటి వెలుగు నిమిత్తం అనువైన ప్రభుత్వ స్థలాలను గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు గుర్తించనున్నారు. జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమ వివరాలపై విస్తృతంగా ప్రచారం చేపట్టాలని ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్న విషయం తెలిసిందే. దీనికనుగుణంగా మండల, గ్రామస్థాయిలో సమావేశాలను నిర్వహిస్తున్నారు. వచ్చే నెల మొదటి వారం నుంచి ఊరూరా కంటి వెలుగు కార్యక్రమంపై దండోర కూడా చేయనున్నారు.
రంగారెడ్డి జిల్లాలో 75 బృందాలు
రంగారెడ్డి జిల్లా జనాభాకు అనుగుణంగా 75 బృందాలను జిల్లావ్యాప్తంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేస్తున్నది. 27 మండలాల్లో 558 గ్రామాల్లో 16 మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ పరిధిలోని పలు యూపీహెచ్సీ, సీహెచ్సీలలో కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. ఆప్తమాలజిస్టుల కోసం ఇప్పటికే నియామక ప్రక్రియ షురూ అయ్యింది. ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్ల ఎంపిక, తదితర సిబ్బంది నియామకాలు చేపట్టనున్నారు.
వికారాబాద్ జిల్లాలో 42 బృందాలు
మొదటి విడుతలో నిర్వహించిన ‘కంటి వెలుగు’లో భాగంగా జిల్లావ్యాప్తంగా 3.48లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించడంతోపాటు అద్దాలు, అవసరమైన వారికి సర్జరీలను కూడా హైదరాబాద్లోని సరోజిని దవాఖానలో ప్రభుత్వం చేయించింది. జనవరి 18 నుంచి నిర్వహించే రెండో విడుతలో భాగంగా జిల్లాలోని 10 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ లక్ష్యంగా నిర్ణయించింది. రోజుకు గ్రామీణ ప్రాంతంలో 350 మందికి, మున్సిపాలిటీల్లో 400 మందికి కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా 42 బృందాలను ఏర్పాటు చేశారు.
కంటి సమస్యలున్నవారికి సేవలు
రంగారెడ్డి జిల్లాలో రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి 75 బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. 75 మంది ఆప్తమాలజిస్తుల నియామకాలు ఇప్పటికే చేపట్టాం. 80 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇంకా డీఈవో(డేటా ఎంట్రీ ఆపరేటర్లు)లను నియమించాల్సి ఉంది. 18 ఏండ్లకు పైబడి కంటి సమస్యలతో ఉన్న ప్రతిఒక్కరూ ‘కంటి వెలుగు’లో సేవలు పొందవచ్చు.
– వెంకటేశ్వర్రావు, రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి
విస్తృతంగా ప్రచారం
కంటి వెలుగు కార్యక్రమంపై వికారాబాద్ జిల్లా అంతటా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాం. ఆప్తమాలజిస్టుల నియామకం పూర్తికాగా, ఆపరేటర్ల నియామకం జరుగుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక కేంద్రం, మున్సిపాలిటీల్లో వార్డుకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి కంటి పరీక్షలను నిర్వహించనున్నాం.
– వికారాబాద్ డీఎంహెచ్వో పల్వన్కుమార్