తెలంగాణ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నది. కులవృత్తులకు చేయూతనందిస్తూనే వంద శాతం సబ్సిడీతో ఆర్థికంగా సాయమందిస్తున్నది. గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ, ఆయా కులాలకు రూ.లక్ష సాయం చేస్తూ ఆదుకుంటున్నది. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘దళితబంధు’ పేరుతో అద్భుత పథకాన్ని అమలు చేస్తున్నది. వారు ఎంచుకున్న యూనిట్లను నెలకొల్పుతూ ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసి, వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతున్నది. ఒకప్పుడు ఉపాధి లేనివారు.. నేడు మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగడం గమనార్హం.
‘దళితబంధు’తో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో మొదటి విడుతలో 358 యూనిట్లు మంజూరు కాగా, ఒక్కొక్కరికీ రూ.10 లక్షల సాయాన్ని అందించింది. లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లలో సక్సెస్ సాధిస్తూ వారు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. పేదరికంలో అనుభవించిన కష్టాలు, బాధలు తీరాయని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా రెండో విడుత ‘దళితబంధు’ ప్రక్రియను రాష్ట్ర సర్కార్ వేగవంతం చేసింది. జిల్లాకు 3962 యూనిట్లు మంజూరు చేసింది. ఇప్పటి వరకు 1328 మంది దరఖాస్తు చేసుకోగా, లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమైంది. తాండూరు నియోజకవర్గం నుంచి 980, వికారాబాద్ నియోజకవర్గం నుంచి 348 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియ కొనసాగుతున్నది. ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా వీలైనంత త్వరగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ నెలాఖరులోగా రెండో విడుత లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.
– వికారాబాద్, ఆగస్టు 27, (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లాలో రెండో విడుత దళిత బంధు ప్రక్రియ వేగవంతమైంది. అర్హులైన లబ్ధిదారుల నుంచి వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారుల ఆధ్వర్యంలో స్వీకరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1328 మంది దళిత బంధు పథకం కింద రూ.10 లక్షల ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే తాండూరు నియోజకవర్గం నుంచి 980 దరఖాస్తులురాగా, వికారాబాద్ నియోజకవర్గం నుంచి 348 మంది దరఖాస్తు చేసుకున్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో ధారూరు మండలంలో 150, కోట్పల్లి మండలంలో 75, వికారాబాద్ మండలం నుంచి 123 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరిగి, కొడంగల్ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటివరకు ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోలేరు.
లబ్ధిదారుల ఎంపికకు చర్యలు
ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా వీలైనంత త్వరితగతిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిన దృష్ట్యా ఈ నెలాఖరులోగా రెండో విడుత దళితబంధు లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. మరోవైపు ఇప్పటివరకు తాండూరు, వికారాబాద్ నియోజకవర్గంలో వచ్చిన దరఖాస్తులకు సంబంధించి ఆయా నియోజకవర్గాలకు నియమించిన ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియను చేపట్టారు. జిల్లాకు రెండో విడుత దళిత బంధులో 3962 యూనిట్లు మంజూరు కాగా.. వికారాబాద్ నియోజకవర్గానికి 1100, తాండూరు నియోజకవర్గానికి 1100 యూనిట్లు మంజూరయ్యాయి. పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని పలు మండలాలు మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో ఉండడంతో పరిగి నియోజకవర్గానికి 881, కొడంగల్ నియోజకవర్గానికి 661 యూనిట్లు, అదేవిధంగా జిల్లా పరిధిలోని చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట్ మండలానికి 220 యూనిట్లను మంజూరు చేసింది.
ప్రత్యేకాధికారుల నియామకం
దళిత బంధు పథకం పర్యవేక్షణకు నియోజకవర్గాలవారీగా ప్రత్యేకాధికారులను నియమించారు. వికారాబాద్ నియోజకవర్గంతోపాటు చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట్ మండలానికి ప్రత్యేకాధికారిగా వికారాబాద్ ఆర్డీవోను, తాండూరు నియోజకవర్గ ప్రత్యేకాధికారిగా తాండూరు ఆర్డీవోను, పరిగి నియోజకవర్గ ప్రత్యేకాధికారిగా డీపీవోను, కొడంగల్ నియోజకవర్గ ప్రత్యేకాధికారిగా డీఆర్డీవోను కలెక్టర్ నియమించారు. మండల స్థాయిలో ఎంపీడీవో, ఎంపీవో, ఏపీఎంలు దళిత బంధు దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. సంబంధిత అధికారులు వచ్చిన దరఖాస్తుల పరిశీలన అనంతరం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. జిల్లా మంత్రి ఆమోదం తెలిపిన అనంతరం కలెక్టర్కు జాబితాను అందజేయనున్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తైన వెంటనే దళిత కుటుంబాల పేరిట బ్యాంకు ఖాతాను తెరువనున్నారు. తదనంతరం యూనిట్ల ఎంపిక ప్రక్రియ షురూ కానుంది.
లబ్ధిదారులు ఎంపిక చేసుకునే యూనిట్లివే..
ఎంపికైన లబ్ధిదారులు దళిత బంధు పథకంలో భాగంగా దళిత కుటుంబాలకు రూ.10 లక్షల్లో మంజూరు చేసే యూనిట్లకు సంబంధించి మినీ డెయిరీ, ట్రాక్టర్-ట్రాలీ, కోడి పిల్లల పెంపకం, వరి నాటు యంత్రం, పందిరి కూరగాయల సాగు, ఏడుగురు కూర్చునే సామర్థ్యంగల ఆటో, ఆటో రిక్షా, సరుకు రవాణా ఆటో, ఐరన్ గేట్స్-గ్రిల్స్ తయారీ యూనిట్-ఆటో, కాంక్రీట్ మిశ్రమం తయారీ యంత్రం, సెంట్రింగ్, మట్టి ఇటుకల తయారీ-ఆటో ట్రాలీ, ఆయిల్ మిల్, బియ్యం, పసుపు గిర్ని, మెడికల్ & జనరల్ స్టోర్స్, మినీ సూపర్బజార్, ఎలక్ట్రానిక్ పరికరాల అమ్మకం-సేవలు, ఎలక్ట్రికల్ షాప్-మోటర్ వైండింగ్-బ్యాటరీ సేవలు, హార్డ్వేర్-శానిటరీ దుకాణం, విత్తనాలు-ఎరువుల-క్రిమిసంహారక మందుల దుకాణం, వ్యవసాయ సాగు కోసం యంత్ర పరికరాల అమ్మకం, హోటల్-క్యాటరింగ్-ఆటోట్రాలీ, డీటీపీ-మీసేవా-సీఎస్సీ ఆన్లైన్ సెంటర్-ఫొటో స్టూడియో, డయాగ్నోస్టిక్ ల్యాబ్-మెడికల్ షాప్, టెంట్హౌస్-డెకరేషన్-లైటింగ్-సౌండ్ సిస్టం-ఆటోట్రాలీ వంటి యూనిట్లతోపాటు లబ్ధిదారులు కోరుకునే ఇతర యూనిట్లను మంజూరు చేస్తారు.
మొన్నటి వరకు కూలీ పని చేసి జీవనోపాధి పొందినవారు.. దళిత బంధు పథకంలో భాగంగా రూ.10 లక్షలు విలువ చేసే యూనిట్లు సొంతం కావడంతోపాటు దండిగా ఉపాధి పొందుతున్నారు. దళిత బంధు పథకంతో గతంలో కారు డ్రైవర్లుగా పనిచేసినవారు.. నేడు ఓనర్లయ్యారు. జిల్లాలో లబ్ధిదారులు మినీ డెయిరీ, పౌల్ట్రీపామ్లతోపాటు కార్లు, ట్రాక్టర్ యూనిట్లను ఎంపిక చేసుకున్నారు. ఆ యూనిట్లకు సంబంధించి ఇప్పటికే ఆయా రంగాల్లోని నిపుణులతో ప్రత్యేక అవగాహన కల్పించడంతోపాటు శిక్షణ కూడా ఇప్పించారు. వారు ఎంచుకున్న వ్యాపారాల్లో ఏ విధంగానైనా నష్టపోయినట్లయితే వారిని ఆర్థికంగా అండగా ఉండేందుకు ఏర్పాటు చేసిన రక్షణ నిధి కింద ఇప్పటివరకు రూ.35.80 లక్షల నిధులను సంబంధిత అధికారులు జమ చేశారు.
మొదటి విడుతలో 358 మంది లబ్ధిదారులు
మరోవైపు మొదటి విడుతలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 358 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, జిల్లాకు రూ.35.80 కోట్ల నిధులను విడుదల చేయగా, 358 యూనిట్లకు సంబంధించి జిల్లా యంత్రాంగం గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. జిల్లాలో మొదటి విడుతలో మంజూరైన యూనిట్లలో వికారాబాద్ నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులు, తాండూరు నియోజకవర్గంలో 100, పరిగి నియోజకవర్గంలో 80, కొడంగల్ నియోజకవర్గంలో 60, చేవెళ్ల నియోజకవర్గంలో 18 యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేశారు.