అసెంబ్లీ ఎన్నికల కోలాహలం ముగిసిందో..లేదో.. అప్పుడే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. వచ్చే సంవత్స రం ఫిబ్రవరి ఒకటో తేదీతో పాలకవర్గాల గడువు ముగియనుండడంతో ఎన్నికలకు ఈసీ కసరత్తును ముమ్మరం చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సర్పంచ్లు, వార్డు సభ్యుల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. సిబ్బంది, పోలింగ్ కేంద్రాల వివరాల సేకరణ ప్రక్రియను చేపడుతూనే..ఈ నెల 30లోగా ఆర్వోలు, సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
200 మంది ఓటర్లకు ఓ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. కాగా జిల్లాలోని 558 గ్రామపంచాయతీలు, 4,992 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. గతంలో మూడు విడుతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈసా రి ఎన్ని విడుతల్లో ఎన్నికలు నిర్వహించాలనే దానిపై జిల్లా అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా ఈసీ నిర్ణయం తీసుకోనున్నది. సిబ్బంది సరిపోకపోతే ప్రభుత్వరంగ సంస్థలు, కేజీబీవీ, మాడల్ స్కూళ్లు, గురుకులాలు, ఎయిడెడ్ పాఠశాలలు, ఇతర సంస్థల సిబ్బందిని ఎన్నికల విధులకు వినియోగించనున్నారు. ఇక పల్లెల్లో ఎన్నికల సందడి మొదలుకానున్నది.
రంగారెడ్డి, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ): ‘గ్రామపంచాయతీల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తున్నది. పంచాయతీలకు 2019 జనవరిలో ఎన్నికలు నిర్వహించగా.. సర్పంచులు, వార్డు సభ్యుల పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటిన ముగియనున్నది. ఈ నేపథ్యంలో జిల్లాలో గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది.
సిబ్బంది, పోలింగ్ కేంద్రాల వివరాల సేకరణ ప్రక్రియను చేపడుతూనే..ఈ నెల 30లోపుగా ఆర్వోలు, సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఎన్నికల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 558 పంచాయతీలు, 4,992 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. గతంలో మూడు విడుతల్లో ఎన్నికలను నిర్వహించారు. ఈసారి సైతం ఎన్ని విడతల్లో ఎన్నికలు నిర్వహించాలనే దానిపై జిల్లా అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోనున్నది.’
ఎన్నికలకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు ప్రతి 200 మంది ఓటర్లకు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక పోలింగ్ అధికారిని నియమించాల్సి ఉంటుంది. 201నుంచి 400 మంది ఓటర్లు ఉంటే ఒక ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ అధికారులు, 401 నుంచి 650 మంది ఓటర్లు ఉంటే ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు పోలింగ్ అధికారులను నియమించాలి.
నిర్ణీత సంఖ్యకు అదనంగా 20 శాతం సిబ్బందిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ప్రతి వార్డులో విధిగా ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా..650 మంది ఓటర్లు దాటితే రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. దీంతో ఈసారి పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల సంఖ్య గతంలో కంటే పెరగనున్నది.
గతంలో మాదిరిగానే మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలో 558 పంచాయతీలు, 4,992 వార్డులు ఉన్నాయి. పాలకవర్గాల కాల పరిమితి వచ్చే ఏడాది ఫిబ్రవరి1 నాటికి ముగియనుంది. ఇంకా..సర్పంచులు, వార్డు సభ్యుల పదవీ కాలం 53 రోజుల సమయం ఉంది. ఈలోగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కొత్త ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పచ్చ జెండా ఊపితే మరో సంగ్రామానికి నగారా మోగనుంది.
ఐదేళ్ల కింద జరిగిన పద్ధతిలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేసే అవకాశాలు ఉన్నాయా ? లేక మార్చుతారా! అన్నదానిపై కూడా త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవీకరించిన జాబితానే పంచాయతీ ఎన్నికల్లో పరిగణనలోకి తీసుకుంటారా? లేక మరోసారి ముసాయిదా విడుదల చేసి కొత్తగా దరఖాస్తులను స్వీకరిస్తారా? అనేది కూడా తెలియాల్సి ఉంది.
అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ సిబ్బంది వివరాల జాబితా కలెక్టర్ కార్యాలయంలో సిద్ధంగా ఉండడంతో అదే జాబితాతో ఎన్నికల నిర్వహణకు సిద్ధం చేయనున్నట్లు తెలుస్తున్నది. ఉద్యోగుల సంఖ్య సరిపడా లేని పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ సంస్థలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, గురుకులాలు, ఎయిడెడ్ పాఠశాలలు, ఇతర సంస్థల సిబ్బందిని ఎన్నికల విధులకు కేటాయించనున్నారు.
పోలింగ్ అధికారులు, సిబ్బంది ఎంపిక కోసం ఈసారి ‘టె-పోల్’ సాఫ్ట్వేర్ను రూపొందించారు. సిబ్బంది పేరు, ఎంప్లాయి కోడ్, ఫోన్ నంబరు, హోదా, వేతన స్కేల్, సొంత మండలం, ప్రస్తుతం పనిచేస్తున్న చోటు తదితర వివరాలను సాఫ్ట్వేర్లో పొందుపర్చనున్నారు. ఎన్నికలు మూడు దశలో జరిగితే.. తొలి దశలో వినియోగించుకున్న సిబ్బందిని మూడో దశలోనూ వినియోగించనున్నారు.