ఇబ్రహీంపట్నం రూరల్, జూలై 14 : వానలు కురుస్తున్నాయి.. వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సరైన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి పది మందిలో నలుగురికి జలుబు, ఇద్దరికి జ్వరంతో కూడిన వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైరల్ జ్వరాలు అకస్మాత్తుగా సోకుతాయి. తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి 102 డిగ్రీల జ్వరం ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పుల మధ్య నిసత్తువగా మారిపోతారు. కొందరిలో ఒంటిపై దుద్దుర్లు, వాంతులు, అరుదుగా విరేచనాలూ కనిపిస్తాయి. మరికొందరిలో జలుబు వంటి లక్షణాలేవీ లేకుండానే జ్వరాలు వస్తాయి. మలేరియా, డెంగీ, చికున్గున్యా, వంటివీ వైరల్ ఫీవర్ కిందకే వస్తాయి.
ప్రభావం..
శరీరంలోని కణాల మీద వైరస్ దాడి చేస్తుంది. చాలా వరకు వైరల్ ఫీవర్తో శరీరం పై భాగం ఎక్కువగా ప్రభావితమవుతుంది. ముఖ్యంగా శ్వాస వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. వైరస్ చాలా పవర్ఫుల్గా ఉంటే నరాల మీద దాడి చేస్తుంది. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
వైరల్ ఫీవర్ రావడానికి కారణం..
వైరల్ ఫీవర్ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. కొన్నిసార్లు శ్వాస నాళాల ద్వారా కూడా వ్యాపిస్తుంది. కలుషిత నీరు, ఆహారం తీసుకున్నప్పుడు వైరల్ ఫీవర్స్ వస్తుంది. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉన్నది. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత తప్పకుండా పాటించాలి. ఇంటి ఆవరణలో పూల తొట్లలో నిలిచిన నీటిని తొలగించడంతో పాటు పాత టైర్లు, పాత డబ్బాల్లో నిలిచిన నీటిని తొలగించాలి. ఇంటి పరిసరాల్లో దోమలు విజృంభించకుండా సరైన జాగ్రత్తలు పాటించాలి.
అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ..
సీజనల్ వ్యాధులు సోకకుండా రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నది. ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లకు అవగాహన కల్పిస్తూ వైరల్ ఫీవర్కు మందులు అందించేలా చర్యలు తీసుకుంటున్నది. జ్వరం, జలుబు, ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని సలహాలు, సూచనలను అందిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి..
సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జ్వరం వస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. దోమ తెరలను వినియోగించాలి. పూల కుండీలు, ఎయిర్కూలర్లు, నీటి గొట్టాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. చల్లటి ఆహార పదార్థాలు కాకుండా వేడి పదార్థాలను తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగితే మంచిది.
– పూనం, వైద్యాధికారి దండుమైలారం