హుస్సేన్సాగర్ తీరం నగరంలోనే అత్యంత ఆదరణ కలిగిన పర్యాటక ప్రదేశంగా మారింది. ఇటీవల ప్రారంభమైన నూతన సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి తోడు జూన్ 1న అమరవీరుల స్మారకం అందుబాటులోకి రానుంది.దీంతో ఈ ప్రాంతమంతాసందర్శకులతో సందడిగా మారింది.
హుస్సేన్సాగర్ చుట్టూ ఇప్పటికే ఉన్న పర్యాటక ప్రదేశాలకు తోడు కొత్తగా మరిన్ని కట్టడాలు వచ్చి చేరాయి. దీంతో ఈ ప్రాంతం ఆధునికంగా, చారిత్రాత్మక వారసత్వం ప్రతిబింబించేలా రూపుదిద్దుకున్నది. హైదరాబాద్ -సికింద్రాబాద్ నగరాల వారధిగా ఉన్న ట్యాంక్ బండ్ సుందరీకరణకు సుమారు రూ.27 కోట్లు వెచ్చించింది. కొత్తగా తెలుగు తల్లి ైప్లెఓవర్ నుంచి బ్రిడ్జి, లుంబినీ పార్కు ఎదుట ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ పార్కు మీదుగా నెక్లస్ రోడ్డు వరకు రూ.9 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. నెక్లస్ రోడ్డులో ఇరువైపులా వాకర్స్, పాదాచారులు, పర్యాటకులను ఆకట్టుకునేలా ఫుట్పాత్లను ఆధునీకరించనున్నారు.
ఇందులో భాగంగా హెరిటేజ్ ఆర్కిటెక్చురల్ అర్నమెంటల్ డెకోరేటివ్ కాంబో స్ట్రీట్ లైట్స్ స్థంభాలు, అర్నమెంటల్ కాస్ట్ ఐరన్ గ్రిల్స్, ప్రీ కాస్ట్ ఫ్లాట్ బ్లాక్ వంటి కొత్తగా ఏర్పాటు చేసి చారిత్రాత్మక ఉట్టిపడేలా నెక్లస్ రోడ్డును ఆధునీకరిస్తున్నారు. ఐమ్యాక్స్ ఇందిరాగాంధీ రోటరీ నుంచి మొదలుకొని సంజీవయ్య పార్కు వద్ద పీవీ ఘాట్ వరకు ఉన్న మార్గాన్ని సరికొత్తగా డిజైన్ చేశారు. ఆధునీకరణ పూర్తయితే ఈ మార్గంలో సందర్శకులు, పర్యాటకులు హాయిగా గడిపేందుకు అనుకూలంగా ల్యాండ్ స్కేపింగ్ను చేయనున్నారు. ప్రస్తుతం ఈ పనులు చురుగ్గా జరుగుతున్నాయని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.