రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో వినూత్న మార్పులు తీసుకొస్తున్నది. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రతి పాఠశాలలో సకల సౌకర్యాలు కల్పిస్తుండడంతో అద్భుతంగా మారుతున్నాయి. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 1338 పాఠశాలలు ఉండగా, తొలి విడుతలో 464 స్కూళ్లు ఎంపికయ్యాయి. ఇందులో 124 పాఠశాలల్లో 1026 పనులకుగాను రూ.57.30 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేయగా, పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతేకాకుండా 197 స్కూళ్లకు పరిపాలన అనుమతులను కూడా మంజూరు చేసింది. మిగతా స్కూళ్లలోనూ త్వరితగతిన అంచనాలు పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన పాఠశాలల్లో 90 శాతం పనులు పూర్తి కాగా, వచ్చే విద్యాసంవత్సరం నాటికి మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే మూడేండ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, విద్యుత్, గ్రీన్ చాక్బోర్డులు, పెయింటింగ్, ప్రహరీ, కిచెన్ షెడ్లు, శిథిలమైన తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, డిజిటల్ విద్యకు అవసరమైన ఏర్పాట్లు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్లు వంటి పనులను పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. – రంగారెడ్డి, ఏప్రిల్ 23, (నమస్తే తెలంగాణ)
తాండూరు, ఏప్రిల్ 23 : ఉందో లేదో స్వర్గం… నా బాల్యం నాకిచ్చెయ్ అంటూ, వాన కురిసినా మెరుపు మెరిసినా తమ కోసమేనంటూ అందంగా బాల్యానికి అక్షర రూపం ఇచ్చారు మహాకవులు. ఆదివారం 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. 2021-22 విద్యా సంవత్సరం ముగియడంతో పిల్లలపై తల్లిదండ్రుల ఆశయాలు, బాధ్యతలు మరింత పెరుగుతాయి. చదువులో వెనుకబడిన వారికి సబ్జెక్టులో ప్రత్యేకమైన తరగతులు చెప్పించాలని, ఇంగ్లిష్, కంప్యూటర్తోపాటు పలు అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించాలంటూ ఆలోచిస్తుంటారు. అయితే పాఠ్యాంశాల్లో రాణించడం ఎంత ముఖ్యమో, మనస్సుకు కాస్త ఆనందం, ఆహ్లాదం, కొంత విరామం కూడా అవసరమంటున్నారు మనస్తత్వ శాస్త్ర నిపుణులు. ఎంతటి పెద్ద వారైనా పసితనపు పసిడి చేష్టల నుంచి వచ్చిన వారే. ఇప్పటికీ ఎవరైనా ముసలి వాళ్లను పలుకరిస్తే మా చిన్న తనంలోనైతే.. అంటూ బాల్యంలోని మధుర క్షణాలను గుర్తు చేసుకొని చిరునవ్వులు చిందిస్తారు. కానీ నేటి పెద్దవాళ్లే చిన్నారులకు ఆ బాల్యపు స్వీట్ మెమోరీని దూరం చేస్తూ బాల్యాన్ని బందీ చేస్తున్నారు. ఈ రోజుల్లో ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు ఒకటే ధ్యాస చదువు…చదువు. కంప్యూటర్స్ గేమ్స్, ఫేస్బుక్, వాట్సాప్ రావడంతో మట్టి ఆటలు మాయమై అనుబంధాలు, అనురాగాలు, ఆప్యాయతలు కనిపించకుండా పోతున్నాయి. ఇంటి దగ్గర బస్సు ఎక్కి పాఠశాలలో దిగే విద్యార్థులకు మనం తినే బియ్యం, పప్పులు ఎలా వస్తాయంటే పెద్ద పెద్ద చెట్ల నుంచి వస్తాయని పేర్కొనడం గమనార్హం. పండ్లు, కూరగాయలు ఎక్కడ పండుతాయంటే రైతుబజార్లో అంటూ సమాధానం ఇవ్వడం చూస్తుంటాము. వీటన్నింటిని గురించి తెలుసుకొని రాబోయే రోజుల్లో పిల్లలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే పిల్లలు తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల మధ్య ఆలనా పాలనలో కొంత సమయం గడపడం తప్పనిసరి అని చెప్పవచ్చు.
ఆత్మీయులను కలుసుకోవడం..
వేసవి సెలవుల్లో దూరంగా ఉండే బంధువులు, స్నేహితులను కలుసుకోవాలి. దీంతో బంధుత్వం, స్నేహబంధం పటిష్టమవుతుంది. అందుకు అనుకూలతను, సమయాన్ని బట్టి బంధువులు, స్నేహితుల ఇంటికి వెళ్లాలి.
విహార యాత్రలకు వెళ్లడం…
కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళ్లడంతో మనశ్శాంతి, వినోదం లభిస్తుంది. దీంతోపాటు చారిత్రక ప్రదేశాలను చూడటం ద్వారా మానసిక వికాసం పెరుగుతుంది. సబ్జెక్టు విషయాల్లో కూడా జ్ఞానం లభిస్తుంది.
రోజుకు రెండు గంటలు చదువడం…
రాబోయే తరగతిలో ఏ సబ్జెక్ట్ అంటే భయంగా ఉందో, ఏ సబ్జెక్టులోనైతే తక్కువ మార్కులు వస్తాయని భావిస్తారో ఆ విషయాలకు సంబంధించి రోజూ కనీసం రెండు గంటలు సాధన చేస్తే మంచిది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, చదువుకున్న పెద్దల వద్ద సాధన చేస్తే మేలు జరుగుతుంది.
వేసవి సెలవుల్లో కళాత్మక నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ప్రతిరోజూ ఒక గంట నృత్యం, పెయింటింగ్, మ్యూజిక్, ఈత(స్విమ్మింగ్) నేర్చుకోవాలి. వీటితో మానసికోల్లాసంతోపాటు రాబోయే కాలంలో జీవనోపాధికి కూడా ఉపయోగ పడుతుంది. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుంది.
వేసవి సెలవుల్లో ఏదైనా ఒకటి, రెండు క్రీడలను పూర్తిగా నేర్చుకోవాలి. ఫుట్బాల్, వాలీబాల్, షటిల్, క్రికెట్, చెస్ వంటి క్రీడలను నేర్చుకోవడం మంచిది. వీటి వల్ల పిల్లలు మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. పిల్లల వయస్సును బట్టి అందుకు కావాల్సిన శక్తి పెంపొందుతుంది. ఎలాంటి అనారోగ్యం దరిచేరదు. ఎండలను దృష్టిలో పెట్టుకొని ఉదయం, సాయంత్రం సమయంలో మాత్రమే బయట ఆటలు ఆడాలి.