ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. విద్యార్థులు బడిబాట పట్టగా, ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యారు. సెలవుల్లో బడికి దూరంగా ఉన్న విద్యార్థులు మళ్లీ స్నేహితులను కలుసుకోవడంతో ఆనందంగా గడిపారు. సెలవుల్లో గడిపిన విషయాలను ముచ్చటించుకుని సంతోషించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను వెంటబెట్టుకుని వచ్చి పలు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం కనిపించింది.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
బొంరాస్పేట, జూన్ 12 : జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు బడిబాట పట్టారు. ఉపాధ్యాయులంతా విధులకు హాజరయ్యారు. తరగతి గదులను, పాఠశాల పరిసరాలను శుభ్రం చేయించారు. మొదటిరోజు కావడం, ఎండలు తీవ్రంగా ఉండడంతో విద్యార్థుల హాజరు అంతంత మాత్రంగానే ఉంది. వచ్చిన కొద్దిమంది విద్యార్థులైనా ఉత్సాహంగా పాఠశాలలకు వచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలను వెంటబెట్టుకొచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం పాఠ్య పుస్తకాలను ముందే పంపిణీ చేయడంతో హెచ్ఎంలు సోమవారం పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఎండలు తగ్గితే విద్యార్థుల హాజరు శాతం పెరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు.
మన ఊరు-మనబడి పనుల పరిశీలన
మండలంలోని రేగడిమైలారం ఉన్నత పాఠశాలను సోమవారం ఎంపీడీవో పాండు సందర్శించి మన ఊరు-మనబడి పనులను పరిశీలించారు. పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని, పాఠశాలలు పునఃప్రారంభమైనందున తరగతి గదులను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు.