మొయినాబాద్, మే22: విద్యా సంవత్సరం ప్రారంభంలోపు అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పూర్తి చేయాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. మండల పరిధిలోని చందానగర్ జిల్లా పరిషత్, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో జరుగుతున్న ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులతో మాట్లాడుతూ మండలంలో మొత్తం 51 పాఠశాలలు ఉన్నాయన్నారు. అందులో 5 జిల్లా పరిషత్ పాఠశాలలు, 14 ప్రాథమిక పాఠశాలలను అమ్మ ఆదర్శ పాఠశాలల కింద అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఆ పనుల కోసం రూ. 1లక్ష నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పాఠశాలల్లో మరుగు దొడ్లు, విద్యుత్, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట డీఈవో సుశీందర్రావు, టీడబ్ల్యూ ఈఐడీసీ ఈఈ కుమార్గౌడ్, తహసీల్దార్ గౌతంకుమార్, ఎంపీడీవో సంధ్య, ఎంఈవో వెంకటయ్య, ఎంపీవో వెంకటేశ్వర్రెడ్డి, హెచ్ఎం రవీందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి స్వప్న ఉన్నారు.