కొడంగల్, ఫిబ్రవరి 27 : వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో జిల్లాలోనే ఎక్కడాలేని విధంగా నాలుగున్నర ఎత్తున్న శివలింగ పానివట్టం పట్టణ శివారులోని గాడిబావి శివాలయంలో ప్రతిష్ఠించారు. దేవాలయం పట్టణ శివారులోని హైదరాబాద్ రోడ్డుపై బండల ఎల్లమ్మ ఆలయ సమీపంలో నెలకొని ఉన్నది. పానివట్టాన్ని చూడగానే మనస్సులో భక్తిభావం ఉప్పొంగిపోతుంది. అంతటి మహత్తరంగా శివలింగం ఉన్నది. ఆనాటి కాలంలో కాకతీయుల పాలనలో 1718 సంవత్సరంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు ఆలయ ద్వారంపై కాకతీయల లిపితో లిఖించబడ్డ ఆనవాలు ఉన్నట్లు ఆలయ అర్చకులు కిట్టుస్వామి తెలిపారు. శివాలయం గర్భగుడి ద్వారంపై కాకతీయుల లిపి ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తున్నది. దాదాపు 300 సంవత్సరాల క్రితం నాటి దేవాలయం అతి పెద్ద పానివట్టాన్ని కలిగి ఉండటంతో భక్తులు శివరాత్రి పర్వదినాన శివలింగాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తన తరలి వస్తుంటారు. గాడిబావి శివాలయం పూర్వ కాలంలో ఎంతో ప్రాచుర్యంలో ఉండేదని, గాడిబావి శివాలయ నామకరణం ఏర్పడేందుకు గతంలో ఆలయ ప్రాంగణం ముందు పొడువాటి కొలను ఉండేది. అన్ని కాలాల్లో పూర్తిస్థాయిలో నీటి నిల్వ ఉండేదని ఆలయ అర్చకులు తెలిపారు. గాడి అంటే పొడువాటి అని అర్థం, ఆలయ ప్రాంగణం ముందు పొడువాటి కొలను ఉండటం వల్ల దేవాలయానికి గాడిబావి శివాలయంగా ప్రాచుర్యం పొందినట్లు తెలిపారు. ఆలయ ప్రాంతం చల్లగా, పూర్తి ఆహ్లాదకరంగా ఉంటుంది. శివరాత్రి పర్వదినాన స్వామిని దర్శించుకునేందుకు, ఉపవాస దీక్షలను ఉపసంహరించు భక్తులు బారులు తీరుతారు. అదేవిధంగా మండలంలోని కస్తూర్పల్లి గ్రామ శివారులో ఆంధ్రప్రదేశ్లోని మహానందిని పోలిన ఆలయం కొలువుదీరి ఉన్నది. అక్కడి మాదిరిగానే ఇక్కడి నంది నోట నుంచి సంవత్సరం పొడవునా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ దేవాలయాన్ని లొంక బసవన్నగా కొలుచుకుంటారు. శివరాత్రిని పురస్కరించుకొని మూడు రోజుల పాటు జాతర ఘనంగా కొనసాగనున్నది.
నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలంలో దేవర్ఫస్లవాద్ గ్రామంలో శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. జాగరణ, అన్నదానం, రథోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు.
బొంరాస్పేట మండల కేంద్రానికి సమీపంలో పెద్ద చెరువు వెనుక ఉన్న పురాతన శ్రీ సంగమేశ్వర దేవాలయం, నాగిరెడ్డిపల్లి గ్రామానికి సమీపంలోని పరమేశ్వరగుట్టపై వెలిసిన శ్రీ పరమేశ్వర దేవాలయంలో ఏటా శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. శ్రీ సంగమేశ్వర దేవాలయం సుమారు నాలుగు వందల సంవత్సరాల కిందట నిర్మించినట్లుగా చెబుతారు. దేవాలయం మొత్తం రాతితో, పెద్ద రాతిగుండ్లతో నిర్మించారు. పది మీటర్ల లోతు సొరంగంలో కొలువైన లింగమూర్తిని ఏటా శివరాత్రికి, శ్రావణమాసంలో ప్రజలు భక్తిశ్రద్ధలతో కొలుస్తారు.
అంతర్రాష్ట్ర రహదారికి పక్కనే ఉన్న ఈ శివాలయానికి ఏండ్ల చరిత్ర ఉన్నది. నెల రోజుల కిందటే ఆలయానికి సున్నం వేసి శివదీక్షలు చేపట్టిన బొంరాస్పేట గ్రామానికి చెందిన భక్తులు దేవాలయంలోనే నిత్యం పూజలు చేస్తున్నారు. ఆలయం దగ్గర నీటి వసతి ఉన్నది. అదేవిధంగా మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామానికి సమీపంలోని శ్రీ పరమేశ్వర దేవాలయం కూడా శివరాత్రి పర్వదినానికి ముస్తాబైంది. పెద్దరాతి గుండు కింద లింగాకారంలో వెలిసిన శ్రీ పరమేశ్వరుడిని తాకి దర్శించుకోవాలంటే బొర్లా పడుకుని పాకుకుంటూ వెళ్లాలి. రెండు పెద్ద బండరాళ్ల మధ్య వెలిసిన శ్రీ పరమేశ్వరుడిని దర్శించుకోవడానికి కూడా శివరాత్రికి వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. దాతల సహకారంతో ఆలయం వద్ద బోర్లు వేసి నీటి సౌకర్యం కల్పించారు. ఏటా శివరాత్రి పర్వదినంతో పాటు శ్రావణమాసంలో పరమేశ్వరుడిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
చారిత్రక కట్టడాలు, దేవాలయాలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. పూర్వ కాలంలోని దేవాలయాలకు పూర్వ వైభవాన్ని సంతరించే ఆలయాలకు ఆదరణ కరువై కనుమరుగవుతున్నాయి. జిల్లాలోనే ఇంత పెద్ద శివలింగ పానివట్టం ఎక్కడా లేదు. నేటికీ ఆలయ ద్వారంపై కాకతీయుల లిపి చెక్కబడి ఉన్నది. దేవాలయానికి పూర్వ వైభవాన్ని సంతరించేందుకు కృషి చేస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే ద్వజస్తంభ ప్రతిష్ఠాపన, నవగ్రహ, నాగ ప్రతిమల ప్రతిష్ఠాపన చేశాం.
– కిట్టుస్వామి, గాడిబావి శివాలయ అర్చకులు, కొడంగల్