వికారాబాద్, ఏప్రిల్ 25 : జిల్లాలో మంజూరైన అభివృద్ధి పనులన్నింటినీ వారం రోజుల్లో ప్రారంభించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం చెక్ డ్యాములు, మన ఊరు మన బడి, రెండో విడుత గొర్రెల పంపిణీ, తాగునీరుతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, ఇంజనీర్ విభాగాల డీఈ, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాకాలం సమీపిస్తున్న దృష్ట్యా జిల్లాలో మంజూరైన 17 చెక్ డ్యామ్లన్నింటినీ మే లోగా పూర్తి చేయాలన్నారు. చెక్ డ్యాములు పూర్తిగా నీటి నిలువలతో ఉండటం వల్ల కాలువల కింద పంటలు పండించుకునే అవకాశం ఉందన్నారు.
రైతులకు సంబంధించిన సమస్య కాబట్టి, పనులు పూర్తి చేసినైట్లెతే వారికి మేలు చేసిన వారమవుతామన్నారు. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అనుకున్న సమయానికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ఊరు మన బడి కింద రూ.30లక్షలలోపు పనులను మే 10లోపు జాతీయ ఉపాధి హామీ పనులతో పాటు అన్ని పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పిల్లలే ఎక్కువగా ఉంటారని, పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించినైట్లెతే ప్రజలకు మంచి సేవలు అందించడంతోపాటు మనకు సంతృప్తిని కలిగిస్తుందన్నారు.
వివిధ రంగాల ఇంజినీరింగ్ విభాగాల ఈఈలు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ పనులు పూర్తి అయ్యేలా చూడాలని ఆయన సూచించారు. మిషన్ భగీరథ ద్వారా గ్రామాల్లో ప్రతి ఇంటికి నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాతీయ ఉపాధిహామీ పనులు చేసేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి 200 మంది చొప్పున కూలీలు పనులు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండో విడుత గొర్రెల పంపిణీకి డాక్యుమెంటేషన్ అప్లోడ్ చేసేందుకు దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే లబ్ధిదారుల వాటాలు వస్తున్నాయని, ఇంకా పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, డీఈవో రేణుకాదేవి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ లాల్సింగ్, పశుసంవర్ధక శాఖ అధికారి అనీల్కుమార్, మిషన్ భగీరథ ఈఈ శ్రీనివాస్బాబు, ఇరిగేషన్ ఈఈలు హబ్సీనాథ్, రేణుక, సీపీవో నిరంజన్, డీటీడబ్ల్యూవో కోఠాజీ, డిప్యూటీ సీఈవో సుభాషిణి పాల్గొన్నారు.