రంగారెడ్డి, జనవరి 27(నమస్తే తెలంగాణ): ‘మన ఊరు – మన బడి’ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం కింద తొలి విడతగా ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, పాఠశాల విద్యా శాఖ రాష్ట్ర కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ దేవసేన, తదితరులతో కలిసి మంత్రి సబితాఇంద్రారెడ్డి శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మన ఊరు – మన బడి పనుల ప్రగతిపై సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల జాబితా రూపకల్పనపై ఆరా తీశారు. ప్రతి మండలంలో క నీసం రెండు పాఠశాలల్లో ఈ నెల 30వ తేదీ నాటికి మన ఊరు – మన బడి పనులన్నీ పూర్తి చేసి, సంబంధిత జిల్లాల మంత్రులు, శాసన సభ్యులతో ప్రారంభోత్సవాలు చేయించేందుకు పాఠశాలలను సిద్ధం చేయాలన్నారు. అధిక మొత్తంలో నిధులను వెచ్చిస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని, ఏ చిన్న పని పెండింగ్లో లేకుండా నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయించాలన్నారు. ప్రారంభోత్సవానికి సమయం సమీపిస్తుండడంతో తుది దశలో మిగిలి ఉన్న పనులను వేగవంతం చేయాలన్నారు. డ్యూయల్ డెస్క్లు, ఇతర ఫర్నిచర్ ఇప్పటికే ఆయా జిల్లాలకు పూర్తి స్థాయిలో చేరుకునేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కాగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఎలాంటి అపోహలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ఆన్లైన్ విధానంలో జరిగేలా కలెక్టర్లు చొరవ చూపాలని మంత్రి సూచించారు.
బదిలీలు, పదోన్నతులకు అన్ని చర్యలు
జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ఇప్పటికే రూపొందించిన ఖాళీలు, సీనియారిటీ జాబితాలను ప్రదర్శించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ అమయ్ కుమార్ మంత్రి సబితారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. మెడికల్ బోర్డును సైతం ఏర్పాటు చేశామన్నారు. ‘మన ఊరు – మన బడి’కి సంబంధించి ఇప్పటికే 38 బడుల్లో పనులు పూర్తయ్యాయని, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఉపాధి హామీ కింద మంజూరు చేసిన పనుల కారణంగా పలు పాఠశాలల్లో ఇంకా కొన్ని పనులు పెండింగులో ఉన్నాయని, త్వరలోనే అవి పూర్తవుతాయని తెలిపారు. సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి ప్రభాకర్, జిల్లా విద్యా శాఖ అధికారి సుశీందర్ రావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు
వికారాబాద్, జనవరి 27 : ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, మన ఊరు మన బడిలో చేపడుతున్న పనుల పురోగతిపై మంత్రి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, డైరెక్టర్ దేవసేన, విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వెంటనే టీచర్ల సీనియార్టీ జాబితా, ఖాళీల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. సీఎం ఆదేశాలతో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపడుతున్నామన్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుకూలంగా పకడ్బందీగా పదోన్నతులు, బదిలీల ప్రక్రియను అమలు చేయాలని మంత్రి సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన 38 పాఠశాలల్లో ఇప్పటికీ 21 పాఠశాలల్లో పూర్తి పనులు చేయించామన్నారు. 17 పాఠశాలలో జాతీయ ఉపాధి హామీ కింద చేయాల్సిన పనులు పెండింగ్లో ఉన్నాయని, వీటిని ఫిబ్రవరి 10లోపు పూర్తి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం 15 పాఠశాలలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లా పరిషత్ ఆవరణలో ఉన్న శివారెడ్డిపేట పాఠశాలలో 30 లక్షలకు పైబడి చేపట్టాల్సిన పనులకు ప్రభుత్వం అనుమతులు వచ్చాయని వివరించారు. వాటిని 45 రోజుల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్తో పాటు జిల్లా విద్యాధికారి రేణుకాదేవి పాల్గొన్నారు.