బొంరాస్పేట, ఏప్రిల్ 15 : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు సోమవారం సమ్మెటివ్-2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. పదో తరగతి పరీక్షలు ఇప్పటికే ముగియగా 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఎస్ఏ-2 పరీక్షలను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో ఉన్న సుమారు 85 వేలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.
22 వరకు పరీక్షలను నిర్వహించి వాటిని ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేసి విద్యార్థులు సాధించిన మార్కులను ఆన్లైన్లో నమోదు చేస్తారు. 23న తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి వారి సమక్షంలోనే ఫలితాలు ప్రకటించి విద్యార్థులకు ప్రగతిపత్రాలను అందజేస్తారు. పాఠశాలలకు 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి.