ఇబ్రహీంపట్నం రూరల్, జనవరి 4 : అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను రుణమాఫీ ద్వారా విముక్తులను చేస్తున్నది. అప్పులు చేసి ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో రైతు బంధు పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నది. ప్రమాదవశాత్తు మృతి చెందితే ఆ రైతు కుటుంబం వీధిన పడకుండా రూ.5లక్షల ప్రమాదబీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నది. 18-59 ఏండ్ల వయస్సు కలిగిన రైతులకు రూపాయి ఖర్చు లేకుండా యేటా రూ.3,275 పభుత్వమే భరించి రైతులకు బీమా బాండ్లను అందజేస్తున్నది. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మృతిచెందిన 221 కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.11.05 కోట్ల బీమా డబ్బులు నామినీ ఖాతాల్లో జమయ్యాయి. దీంతో బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
పైసా ఖర్చులేదు.. పైరవీలకు తావులేదు
సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబీమా విధివిధానాలను పకడ్బందీగా రూపొందించారు. దళారుల ప్రమేయం లేకుండా, పైసా ఖర్చు లేకుండా పరిహారం అందేలా ప్రణాళికలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు, అవకతవకలకు అవకాశం లేకుండా దేశంలోనే అత్యంత నమ్మకమైన జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)తో ఒప్పందం చేసుకున్నారు. గతంలో పట్టాదారు పాసుపుస్తకాలు అందుకున్న ప్రతీ రైతుకు బీమా సౌకర్యం వర్తిస్తున్నది. రైతు మరణించిన వెంటనే సంబంధిత ఏఈవో బాధితుడి ఇంటిని సందర్శించి పూర్తి వివరాలతో పాటు మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. దీంతో రైతు మరణించిన పది రోజుల్లోనే నామినీ ఖాతాలో పరిహారం జమవుతున్నది.
రైతు మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే..
రైతులు మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే తమ క్లస్టర్ పరిధిలోని ఏఈవోలు నేరుగా వారి ఇండ్లకు వెళ్ల్లి రైతు బీమాకు కావాల్సిన పత్రాలను తీసుకుంటున్నారు. అర్హులైన ప్రతీ రైతుకు బీమా పథకం వర్తించేలా చూస్తున్నారు. బీమాకు సంబంధించిన వివరాలను తీసుకుని ఆన్లైన్లో పొందుపర్చిన వెంటనే వారికి ప్రభుత్వం నుంచి రూ.5లక్షల బీమా అందుతున్నది. ఈ విషయంలో ఏఈవోల పనితీరుపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేనిది
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఈ పథకం ద్వారా మా కుటుంబానికి రూ.5లక్షల బీమా అందింది. మా అమ్మ బత్తుల మంగమ్మ పేరుపై మా గ్రామంలో మాకు 27గుంటల భూమి ఉంది. మా అమ్మ ఇటీవల మృతిచెందడంతో రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన పరిహారంతో మా కుటుంబం సంతోషంగా ఉంది. రైతు బీమా ద్వారా రూ.5లక్షలు అందజేసిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– బత్తుల శివకుమార్, చర్లపటేల్గూడ
ప్రతి ఒక్కరూ బీమా చేయించుకోవాలి
నియోజకవర్గంలో కొంతమంది రైతులు రైతు బీమా చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. భూమి ఉండి రైతు బీమా చేయించుకోని రైతులు తప్పనిసరిగా స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి. ప్రమాదవశాత్తు మృతిచెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటున్నది. రైతు బీమాపై సంబంధిత అధికారులు రైతులకు అవగాహన కల్పించాలి.
– సత్యనారాయణ, ఏడీఏ, ఇబ్రహీంపట్నం