ఇబ్రహీంపట్నంరూరల్ : దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగ ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కింద ఏటా రూ. 50వేల కోట్లు అందజేస్తూ ఆదుకుంటున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా గురువారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటి పరిధిలోని బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రంగోలి, క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. అలాగే, ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఎమ్మెల్యే సొంతంగా క్యాష్ బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ ప్రయోజనాల కోసం పంటపెట్టుబడి సహాయం కింద ఏడాదికి రెండుసార్లు రైతుబంధు పథకం కింద రూ. 10వేలు అందజేస్తుందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కాపీ కొడుతున్నాయని తెలిపారు. రైతుబంధు సంబురాల్లో భాగంగా విద్యార్థిని విద్యార్థులు తీర్చిదిద్దిన రైతుబంధుకు సంబంధించిన ముగ్గులను ఎమ్మెల్యే తిలకించి ఎంపిక చేశారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, ఆకుల యాదగిరి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మొద్దు అంజిరెడ్డి, వైస్ ఎంపీపీ ప్రతాప్రెడ్డి, వ్యవసాయశాఖ ఏడీఏ సత్యనారాయణ, ఎంపీడీఓ మహేశ్బాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్, కౌన్సిలర్ నల్లబోలు మమత, మాజీ సర్పంచ్ కాల్లె గణేష్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.