నందిగామ, ఏప్రిల్ 23 : అన్నదాతలు ఏ కారణంతోనైనా మృతి చెందితే, వారిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులు రోడ్డున పడకుండా ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. రైతు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం నందిగామ మండలంలో విజయవంతంగా కొనసాగుతున్నది. మండలంలోని 5 రెవెన్యూ గ్రామాల(18 గ్రామ పంచాయతీలు)లో 22,731 ఎకరాల వ్యవసాయ భూమి ఉంంది. 8,874 మంది పట్టాదారులు ఉన్నారు.
రైతు బీమా అమలులోకి వచ్చిన 2018 ఆగస్టు14 నుంచి మండలంలో ఇప్పటి వరకు 107 మంది రైతులు పలు కారణాలతో మృతి చెందారు. వీరిలో ఇప్పటికే 102 మందికి ఒక్కొక్క రైతు కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.5.10 కోట్లు మృతి చెందిన రైతు నామినీ సభ్యులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ అయ్యాయి. కాగా ముగ్గురు రైతు కుటుంబ సభ్యులు తమ డాక్యుమెంట్లను ఎల్ఐసీ వద్ద ప్రాసెస్లో ఉన్నాయి.
అప్పు తీర్చి అవసరాలకు..
నా భర్త జెట్ట శివకుమార్ అనారోగ్యంతో 3 నెలల క్రితం చనిపోయాడు. దీంతో రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకున్నాను. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్ల్లో రూ.5 లక్షలు నా బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఈ డబ్బుతో అప్పులు తీర్చి అవసరాలకు ఉపయోగించుకుంటున్నాను.
– జెట్ట శాంతమ్మ, మోత్కులగూడ
దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో బీమా సొమ్ము
రైతులు ఏ కారణంతో నైన చనిపోతే సంబంధిత కుటుంబ సభ్యులు చనిపోయిన రైతు డెత్ సర్టిఫికెట్, ఆధార్, బ్యాంకు, పట్టాదారు పాసు పుస్తకాల జిరాక్స్ పత్రాలు, ఎల్ఐసీ బాండ్ తదితర పత్రాలను వారం రోజుల్లో అందించాలి. కేవలం 15 రోజుల్లో బీమా సొమ్ము నామినీ ఖాతాల్లోకి జమ అవుతుంది. మండలంలో ఇప్పటికే 102 మంది లబ్ధిదారులకు రూ.5.10 కోట్లు వారి ఖాతాలో జమ అయ్యాయి.
– శ్వేత, ఏవో, నందిగామ మండలం