ఓ వైపు యాసంగి పంటల సాగుకు సమయం మించిపోతుండడం.. మరోవైపు చేతిలో చిల్లి గవ్వలేకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ ఏటా రెండు సార్లు సకాలంలో రైతుబంధు అందిస్తే రైతులు దర్జాగా పంటలు సాగు చేసుకునేవారు. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. గతంలో మాదిరిగానే పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినా.. అమలులో తీవ్ర జాప్యం చేస్తుండడం అన్నదాతల పాలిట శాపంగా మారుతున్నది.
ఈ యాసంగిలో రంగారెడ్డి జిల్లాలో 4,04,436 మంది రైతులకు రూ.378.92కోట్ల సాయాన్ని అందించాల్సి ఉండగా.. ఇప్పటివరకు 98,011 మంది రైతులకు రూ.20.11కోట్లను మాత్రమే అందించింది. కనీసం ఎకరం భూమి ఉన్న రైతులకూ సాయం అందకపోవడంతో వారు వ్యవసాయ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరికొందరు నిత్యం బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ నిరాశకు గురవుతున్నారు. పంటల సాగుకు ఆలస్యమవుతుండడంతో చాలామంది రైతులు అప్పుల కోసం వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే రైతుబంధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.
-రంగారెడ్డి, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ‘యాసంగి సీజన్కు రైతు బంధు సాయం అందక రైతాంగం ఆందోళన చెందుతున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన విధంగానే ఈ సారి సాయం అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ సాయం అందించడంలో జాప్యం నెలకొంటున్నది. ఈ యాసంగిలో రంగారెడ్డి జిల్లాలో 4,04,436 మంది రైతులకు రూ.378.92కోట్ల సాయాన్ని అందించాల్సి ఉంది.
అయితే ఇప్పటివరకు 98,011 మంది రై తులకు రూ.20.11కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 13 నుంచి సాయం పంపిణీ ప్రారంభమైనప్పటికీ అరకొర మందికి మాత్రమే సాయం వచ్చింది. ఇప్పటివరకు ఒక్క ఎకరా ఉన్న రైతులకు సా యం అందలేదు. గుంటల్లో ఉన్న వారికి మాత్ర మే కాస్తో! కూస్తో! జమ అవుతున్నది. దీంతో రైతులు వ్యవసాయ అధికారుల చుట్టూ ప్రదక్షిణ లు చేస్తూ సాయం డబ్బులు ఎప్పుడు ఖాతాల్లో జమ అవుతాయని అడుగుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో పెట్టుబడుల కోసం వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.’
జిల్లాలో ప్రస్తుత యాసంగిలో 1.23లక్షల ఎకరా ల్లో పంటలు సాగు అవుతాయని జిల్లా వ్యవసా య శాఖ అంచనా వేసింది. ఇప్పటికే మొక్కజొన్న, వేరుశనగ, ఆముదం, కుసుమలు, శనగలు తదితర పంటల సాగును సుమారు 10వేల ఎకరాల్లో రైతులు మొదలు పెట్టారు. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తామని చేసిన ప్రకటన రైతుల్లో సంతోషాన్ని నింపింది. ఈ సీజన్కు గత ప్రభుత్వంలో ఇచ్చినట్లుగానే ఎకరాకు రూ.5వేల సాయం అందిస్తామని చెప్పి రంగారెడ్డి జిల్లాలో 4,04,436 మందికి రూ.378.92కోట్ల సాయం అందించేందుకు నిర్ణయించింది. రైతుల ఖాతాల్లో జమ అయినట్లుగా పోర్టల్లో చూపుతున్న మొత్తం రైతుల ఖాతాలకు మాత్రం వెంటనే చేరడం లేదు. ప్రభుత్వం సా యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి పది రోజులు కావొస్తున్నప్పటికీ ఇప్పటివరకు కేవలం రూ.20.11కోట్లు మాత్రమే జమ అయ్యాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 నుంచి రైతు బంధు పథకాన్ని మొదలుపెట్టి 11 విడుతల్లో నిర్విఘ్నంగా అందించింది. అప్పట్లో ఒక ఎకరా లోపు ఉన్న వారికి ముందుగా సాయం డబ్బులు రైతు ఖాతాల్లో జమ అయ్యేవి. ఆ తర్వాత రెండో రోజు రెండు ఎకరాల రైతులకు, మూడో రోజు మూడు ఎకరాల రైతులకు ఇలా.. సాయం డబ్బులు ఖాతాల్లో జమ అయ్యేవి. అయితే ప్రస్తుత యాసంగిలో మాత్రం గుంటల్లో భూమి ఉన్న వారికి తప్పా ఇప్పటివరకు ఎకరా ఉన్న రైతులకు రైతు బంధు సాయం రాలేదు. దీంతో రైతులు సాయం కోసం నిరీక్షించాల్సి వస్తున్నది.
వ్యవసాయ కార్యాలయాలకు వెళ్లి రైతు బంధు సాయంపై వాకబు చేయడం రైతులకు దినచర్యగా మారింది. కొందరు రైతులకు ఫోన్లు చేసి తెలుసుకుంటున్నారు. సీజన్ ఆరంభంలోనే అందాల్సిన సాయంలో జాప్యం నెలకొనడంపై రైతులు అయోమయానికి గురవుతున్నారు. పెట్టుబడులకు చేతిలో డబ్బులు లేక.. చాలా మంది వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రైతు బంధు డబ్బుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులందరికీ సాయం వస్తుందని అధికారులు రైతులకు భరోసా కల్పిస్తున్నారు.