కొత్తూరు రూరల్ : ఐక్యరాజ్య సమితి గుర్తించిన పది ఉత్తమమైన పథకాలలో రైతుబంధు పథకం అత్యుత్తమమైందని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యుడు కొంత గోవర్థన్రెడ్డి అన్నారు. శుక్రవారం కొత్తూరు మండల పరిధిలోని గూడూరు గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టేట్ ఫుడ్ కమిషన్ ఆధ్వర్యంలో రైతుబంధు పథకంపై ఉపన్యాస, వ్యాసరచన, ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యుడు కొంత గోవర్థన్రెడ్డి హాజరై ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందచేశారు. మొదటి బహుమతి గెలుచుకున్న విద్యార్థికి రూ. 1016లను, రెండో బహుమతి గెలుచుకున్న విద్యార్థికి రూ. 516ల నగదు బహుమతులను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా పెట్టుబడి పెట్టలేని బీద రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న ఎకరానికి ఐదు వేల రూపాయలు ఎంతో చేయూతనందిస్తుందన్నారు.
ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి పదివేల రూపాయాలు రైతు పంట పెట్టుబడికి ఎంతో భరోసాను అందచేస్తుందన్నారు. రైతుబంధు పథకం దేశానికే గర్వకారణం అన్నారు. కార్యక్రమంలో మెంబర్ సెక్రెటరీ మనోహర్, మండల విద్యాధికారి కిష్టరెడ్డి, పాఠశాల హెచ్ఎం చంద్రశేఖర్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.