వికారాబాద్ ప్రజల దశాబ్దాల కల సాకారం కానున్నది. వికారాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్లే రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.12 కోట్ల నిధులను మంజూరు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు టెండర్ ప్రక్రియను పూర్తి చేయగా, ఇందుకు అవసరమైన డిజైన్ను సైతం తయారు చేశారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు అధికారులు, కాంట్రాక్టర్లు ప్రణాళికను రూపొందించారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలు తొలగి, రాకపోకలకు మార్గం సుగమం కానున్నది. ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్ సీఎం కేసీఆర్తో మాట్లాడి నిధులు మంజూరు చేయించినందుకు ఈ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్, నవంబర్ 18 : వికారాబాద్ పాంత్ర ప్రజలు హైదరాబాద్కు వెళ్లాలంటే నిత్యం బ్రిడ్జిపై నుంచి వెళ్లాల్సి ఉంటుంది. దాదాపు 80 ఏండ్ల క్రితం నిర్మించిన రైల్వే బ్రిడ్జి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నది. ప్రతి దినం వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో బ్రిడ్జి మూలమలుపుల వద్ద రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ వెళ్లాలంటే ప్రధాన రోడ్డు మార్గం ఒక్కటే ఉంది. వికారాబాద్ పట్ణణ ప్రజల సుదీర్ఘ కోరిక అయిన బ్రిడ్జి నిర్మాణం చేపట్టి, వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేయాలని ప్రజలు కోరుతున్నారు. దశాబ్దాల కాలం నుంచి ఎన్నో పార్టీలు, ఎంతో మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారంలోకి వచ్చినా వికారాబాద్ ప్రాంత ప్రజలు కోరిక నెరవేర్చలేక పోయారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత వికారాబాద్ ప్రాంతానికి మంచి రోజులు వచ్చాయి. వికారాబాద్ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడంతోపాటు ప్రజల సౌకర్యాల కోసం కలెక్టరేట్ను కూడా అందుబాటులో ఉంచారు. ప్రస్తుతమున్న వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్కు ఈ ప్రాంత ప్రజలు బ్రిడ్జి విషయమై విన్నవించారు. ప్రజల సౌకర్యాల మేరకు సీఎం కేసీఆర్తో మాట్లాడి బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు తీసుకొచ్చారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఇటీవలే బ్రిడ్జి నిర్మాణానికి రోడ్డ భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి రూ.12కోట్లు నిధులు మంజూరు చేశారు. సంబంధిత అధికారులు బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన డిజైన్ను తయారుచేశారు. బ్రిడ్జి నిర్మాణానికి స్థల ప్రదాత బిషఫ్ ఎంఏ డానియేల్ నివాసంలో చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్ చర్చలు జరిపి సఫలం చేశారు. బ్రిడ్జి నిర్మాణానికి అడ్డంకులు లేకుండా పోయాయి. సర్వే చేసి అప్రూల్ చేస్తే పనులు ప్రారంభమవుతాయి. సమస్య పరిష్కారానికి కృషి చేసిన సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేకు ప్రాంత వాసులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
త్వరలో బ్రిడ్జి నిర్మాణ పనులు
మంజూరైన రూ.12కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి టెండర్ ప్రక్రియను పూర్తి చేసి సిద్ధం చేశారు. వికారాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే రైల్వే బ్రిడ్జికి 160 మీటర్ల కొత్త బ్రిడ్జిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అవసరమైన డిజైన్ను తయారుచేసి సిద్ధం చేశారు. 9 పిల్లర్లు, 2 అపార్ట్మెంట్లు వేయనున్నారు. 6 నుంచి 9 నెలల్లో పనులు పూర్తి చేసేందుకు అధికారులు, కాంట్రాక్టర్లు సిద్ధం చేసుకుంటున్నారు. బ్రిడ్జి చివరలో ఉన్న గుడి నుంచి బ్రిడ్జి మధ్య వరకు గల రోడ్డుపై మరమ్మతులు చేయనున్నారు. దీంతో ఈ మార్గంలో వికారాబాద్కు వచ్చే వాహనదారులకు కొంతమేర ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి.