ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 4 : పందిరిపై కూరగాయలు సాగు చేస్తూ ఎందరో రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. కూరగాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. పందిరిసాగుకు యాజమాన్య పద్ధతులు, మెళకువలు పాటిస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించ్చని కృషి విజ్ఞానకేంద్ర వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా తీగజాతి కూరగాయలైన సోర, బీర, కాకర, దోస, పొట్ల, దొండ పంటలను రైతులు అధికంగా సాగు చేస్తున్నారు.
సాగుకు సమయమిదే..
సొరకాయ, దోసకాయ, కాకరకాయ తీగజాతి కూరగాయలను జనవరి రెండో మాసం నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవాలి. బీర విత్తనాలు డిసెంబర్ రెండో వారం నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు. ఈ నెల చివరి వరకు పొట్లకాయ విత్తుకునే అవకాశం, దొండ జూన్, జూలై నెలల్లో విత్తుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఏమైనా సలహాలు, సూచనలు కావాలంటే సంప్రదించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
విత్తన మోతాదు..
ఎకరానికి సోర 0.6 నుంచి 0.8కిలోలు, బీర 0.6నుంచి 0.8కిలోలు, కాకర 0.8నుంచి ఒక కిలో వరకు, పొట్ల 0.6నుంచి 0.8కిలోలు, దోస కిలో నుంచి 1.4కిలోలు, దొండ చూపుడు వేలు మందం కలిగి నాలుగు కణుపులుగల కాండం ముక్కలు 1333 నుంచి 2వేల వరకు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు.
విత్తేదూరం..
బీర, కాకర, దోస విత్తనాలను వేసవిలో రెండు వరుసల్లో మొక్క మొక్కకు మధ్య 2మీటర్లు, ఒక వరుసలో మొక్క మొక్కకు మధ్య వెడల్పు 0.5మీటరు ఉండాలి. సోర 2.5మీటర్ల పొడవు అర మీటరు వెడల్పు ఉండాలి. దొండ, పొట్ల సాగులో పొడవులో 2 మీటర్లు, వెడల్పులో 1-2 మీటర్ల దూరం కలిగి ఉండాలి.
ఎరువుల యాజమాన్యం..
ఎకరానికి 6-8టన్నుల మాగిన పశువుల ఎరువు లేదా 1.5 టన్నుల వానపాముల ఎరువుతో పాటు 4కిలోల పాస్పోబ్యాక్టీరియా, 4కిలోల ఆజోస్పైరిల్లమ్ను ఆఖరి దుక్కిలో వేయాలి.
రసాయన ఎరువులు : 32-40కిలోల భాస్వరం, 16-20కిలోల పొటాష్, 32-40కిలోల నత్రజని ఎకరానికి వేయాలి. భాస్వరం, పొటాష్ను పాదుల్లో వేయాలి. నత్రజనిని రెండు సమభాగాలుగా చేసుకుని విత్తిన 25-30 రోజులకోసారి, పూత, పిందె సమయంలో మరోసారి వేయాలి. వేసవిలో ఆడపూలు ఎక్కువగా వచ్చేందుకు 2-4 ఆకుల దశలో లీటర్ నీటికి 2 గ్రాముల బోరాక్స్ను కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
సస్యరక్షణ చర్యలు..
గుమ్మడి పెండు పురుగు : ఇవి మొక్క మొలిచిన వెంటనే ఆశించి నష్టపరుస్తారు. నివారణకు 2శాతం పాలిడాల్ పొడిని వారంలో రెండుసార్లు చల్లాలి. వీటి ప్రభావం ఎక్కువగా ఉంటే లీటర్ నీటికి ప్రాఫినోఫాస్ 2 మి.లీ. లేదా మలాథియాన్ 2 మి.లీటర్ల చొప్పున కలిసి పిచికారీ చేయాలి.
పొట్లాకు పురుగు : ఇవి మొక్కల పెరుగుదల, పూత దశల్లో ఆకులను ఎక్కువగా కొరికివేస్తాయి. నివారణకు క్లోరోఫైరిపాస్ 2 మి.లీ లేదా ఒక గ్రాము థయోడీకార్ప్ను లీటర్ నీటికి కలిపి పూతకు ముందు పిచికారీ చేయాలి.
పండు ఈగ : పండు ఈగసోకి పంటలో కోతకు వచ్చే కాయలను ధ్వంసం చేయడంతో పాటు కాయ లోపలి భాగం కుల్లి నాణ్యత తగ్గుతుంది. దీనికి ఒక మి.లీ మలాథియాన్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నివారణకు 10 లీటర్ల నీటికి 100 మి.లీ మలాథియాన్, 100 గ్రాముల బెల్లం, 250మి.లీ బాగా పులిసిన కల్లును మట్టి మూకుళ్లల్లో పోసి పొలంలో అక్కడక్కడ పెట్టాలి.
బూజు తెగులు : నివారణకు లీటర్ నీటికి మాంకోజబ్ 2.5గ్రాముల లేదా తీవ్ర దశలో ఉంటే రెడోమిల్ ఎం.జడ్ ఒక గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
బూడిద తెగులు : నివారణకు లీటర్ నీటికి ఒక మి.లీ కెరాథేన్ లేదా ఒక గ్రాము డైనోకాప్ కలిపి పిచికారీ చేయాలి.
– గుమ్మడి పెంకు పురుగుల కారణంగా చెట్టు ఎదుగుదల మందగిస్తుంది దీనికి క్లోరోఫైరిసాస్ 2మిల్లీ, వేపనూనే 5మి.లీ కలిపి పిచికారీ చేయాలి.
– రసంపీల్చే పురుగులు సోకడం వల్ల ఆకుల్లోని పత్రహరితం దెబ్బతిని ఆకుముడతలు ఏర్పడుతాయి. వీటి నివారణకు 1.5 గ్రాముల ఎస్పేట్, పిప్రోనిల్ రెండు మి.లీ ఇమిడాకోప్రిడ్ ఒక మి.లీ నీటికి వినియోగించాలి.
పాము పొడ పురుగు : ఈ పురుగు కారణంగా చెట్టు బలహీన పడుతుంది. వీటికి 1గ్రాము అబామెక్టిన్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
– బూడిద తెగులు సోకడం వల్ల కాయ, ఆకులు, పసుపుపచ్చ రంగులోకి మారి పూర్తిగా దెబ్బతింటాయి. దీని నివారణకు గుమ్మడి పెంకు పురుగుల కారణంగా చెట్టు ఎదుగుదల మందగిస్తుంది. దీనికి క్లోరోఫైరిసాస్ 2మిల్లీ, వేపనూనే 5మి.లీ కలిపి పిచికారీ చేయాలి.
– రసంపీల్చే పురుగులు సోకడం వల్ల ఆకుల్లోని పత్రహరితం దెబ్బతిని ఆకుముడతలు ఏర్పడుతాయి. వీటి నివారణకు 1.5 గ్రాముల ఎస్పేట్, పిప్రోనిల్ రెండు మి.లీ ఇమిడాకోప్రిడ్ ఒక మి.లీ నీటికి వినియోగించాలి.
ఆకుపచ్చ తెగులు : నివారణకు లీటర్ నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. వేరుకుళ్లు తెగులును ఎండు తెగులు అని కూడా అంటారు. దీని ప్రభావం వల్ల తీగలు వాడిపోయి ఆకులు ఎండి రాలిపోతాయి. నివారణకు బోర్డో మిశ్రమం 1శాతం లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ను 3 గ్రాములు లీటర్ నీటిని కలిపి మొక్కల మొదళ్ల దగ్గర తడిచేటట్లు పది రోజుల వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు పోయాలి. ముందు జాగ్రత్తగా దుక్కిలో ఎకరాకు 250కిలోల వేపపిండిని వేసి బాగా కలియదున్నాలి. పంట వేసిన తర్వాత ట్రైకోడెర్మా విరిడే కల్ఫర్ను పశువుల ఎరువులో కలిపి మొక్కల పాదుల దగ్గర వేయాలి.
జాగ్రత్తలు పాటిస్తే లాభాలు..
తీగజాతి కూరగాయల సాగు చాలా తేలిక. ఖర్చూ తక్కువే. ఇవి ఎగబాకడానికి వెదురు కర్రలతో పందిర్లు వేసి వాటిపైకి ఎక్కేందుకు తాళ్లను కట్టాలి. పందిరి వేస్తే కాసిన కాయలు కిందకు వేలాడుతాయి. ఇలా వేలాడిన వాటిని తెంపడానికి సులభం. ఇలా పండించిన కూరగాయలు నాణ్యతగా ఉండడంతో మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. ప్రస్తుతం సరైన సమయమైనందున తీగజాతి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి.
– శ్రీకృష్ణ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త