క్షణాల్లో రిజిస్ట్రేషన్.. నిమిషాల్లో మ్యుటేషన్.. ఇది ధరణి ప్రత్యేకం.. ఇంత మంచి పోర్టల్ను తొలగించి.. పాత పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకొస్తామంటున్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై రైతులు కన్నెర్ర చేస్తున్నారు. తమ భూములు లాక్కోవాలని.. హక్కులు హరించాలని చూస్తే సహించేది లేదని, ఓటుతో బుద్ధి చెబుతామని కర్షకులు హెచ్చరిస్తున్నారు.
పహాణీ, ఆర్వోఆర్ నకలు పుట్టించి తమ భూములపై బినామీలు రుణాలు తీసుకొని కష్టాల పాలు చేసిన వ్యవస్థ మాకొద్దంటూ నినదిస్తున్నారు. మళ్లీ దళారులు పుట్టుకొస్తారని.. లంచాలు ఇవ్వనిదే పనులు జరగవని అభిప్రాయపడుతున్నారు. గతంలో రెవెన్యూ అధికారులతో అన్నదాతలు పడిన కష్టాలను గుర్తు చేసుకుంటున్నారు. ధరణి వ్యవస్థను బంగాళాఖాతంలో వేస్తామంటున్న కాంగ్రెసోళ్ల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– రంగారెడ్డి, నవంబర్ 24(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, నవంబర్ 24(నమస్తే తెలంగాణ) : ‘ధరణిని రద్దు చేసి పాత పద్దతినే తెస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతుండడం పట్ల జిల్లా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. కాంగ్రెస్ను నమ్మితే నిండా మునగడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు. పైరవీకారులు రాజ్యమేలుతారని, లంచావతారులు పుట్టుకొస్తారని, ఏ చిన్నపనికైనా అధికారులు తమ చుట్టూ ఏండ్ల తరబడి తిప్పుకుంటారని వాపోతున్నారు. రికార్డులు తారుమారు చేసి ఒకరికొకరికి మధ్య పంచాయతీలు పెడతారని మండిపడుతున్నారు. అలవిగాని హామీలతో తెలంగాణలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ కొత్త కుట్రలకు తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలది ఇష్టారాజ్యంగా ఉండి భూదందాలు సాగించేవారని, ‘ధరణి’ స్థానంలో ‘భూమాత’ పోర్టల్ను తెచ్చి దోపిడీకి పాల్పడాలని చూస్తున్నారని విమర్శిస్తున్నారు. భూ హక్కుల కోసం గతంలో పడ్డ ఇబ్బందులు ఇంకా కండ్ల ముందు కదలాడుతున్నాయని, ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కనివ్వకుండా తరిమికొడతామని శపథం చేస్తున్నారు. ధరణిని కాంగ్రెస్ రద్దు చేయడం కాదు..తామే వారిని రద్దు చేస్తామని బాజప్తా చెబుతున్నారు.’
గతంలో రిజిస్ట్రేషన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్లం. ‘ధరణి’ వచ్చాక పైరవీలు లేకుండా నిమిషాల్లోపే భూముల రిజిస్ట్రేషన్ అవుతున్నది. అటువంటి ‘ధరణి’ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుంది ? మళ్లీ రైతులు దళారులు, పైరవీకారుల చుట్టూ తిరగాలెనా. కౌలు చట్టంతో పట్టాదారులకు, కౌలు రైతులకు మధ్య కొట్లాటలు అవుతాయి. ‘ధరణి’ని బంగాళఖాతంలో కలుపుతామని చెప్పే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదుందా.. సచ్చేదుందా.. వాళ్ల మాటలు మేం నమ్మం. బీఆర్ఎస్ పార్టీకే నా మద్దతు. కారు గుర్తుకే నా ఓటు.
– ముత్యాలు, ఏక్వాయిపల్లి గ్రామం, (కడ్తాల్)
కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు.. సచ్చేది లేదు.. ఆ పార్టీని నమ్ముకుంటే రైతులకు తిప్పలు తప్పవు. చక్కదనంగా సాగుతున్న ‘ధరణి’ని రద్దు చేస్తామని చెప్పుడేంది.. వాళ్లను రైతులు ఆదరించరు. ‘ధరణి’తో ఏండ్ల తరబడిగా పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యలకు పరిష్కారం లభించింది. భూముల వివరాలు ఆన్లైన్లో భద్రంగా ఉన్నాయి. గతంలో మాదిరిగా కౌలుదారు చట్టం, పట్వారీ వ్యవస్థ తీసుకొస్తే పైరవీకారుల చేతిలో రైతులు అవస్థలు పడాల్సిందే. భూములు కౌలుకు ఇచ్చే రైతులకు సైతం తిప్పలు తప్పవు. ధరణి పోర్టల్ను రద్దు చేస్తే రైతులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. రైతుల బాగును పట్టించుకున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్. రైతులమంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం.
– సామ మల్లారెడ్డి, ఎర్రొనిగూడ(షాబాద్)
ఏండ్ల భూ సమస్యలకు ‘ధరణి’తో పరిష్కారం లభించింది. ‘ధరణి’ని రద్దు చేయాలని అంటున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు. అధికారంలోకి రాని కాంగ్రెసోళ్ల మాటలు మేమెందుకు పట్టించుకుంటం. పటేలు తీసుకొస్తా.. పట్వారీ వ్యవస్థను తీసుకొస్తా.. అని ఏ బుద్ధి ఉన్న నాయకుడు మాట్లాడడూ.. ఎవరూ వినరూ.. కాంగ్రెస్ నాయకులు మతి ఉండే మాట్లాడుతున్నారా..? సరైన అవగాహన లేని కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నది. వారి కల్లబొల్లి మాటలను జనం నమ్మె పరిస్థితిలో లేరు. ధరణి వల్ల ఒకేచోట రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ కావడంతో పాటు ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పింది. సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం. బీఆర్ఎస్ పార్టీకే మద్దతు తెలుపుతం. కారుగుర్తుకే మా ఓటు.
– వీరారెడ్డి, బ్రహ్మణపల్లి (తుర్కయాంజాల్)
కాంగ్రెసోళ్లు సోయిలేని మాటలు మాట్లాడుతుండ్రు.. వ్యవసాయంపై అవగాహన ఉంటే ఇలా మాట్లాడరు. గతంలో భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే నానా ఇబ్బందులు పడేవాళ్లం. అమ్మకందారు, కొనుగోలుదారుతో పాటు సాక్షులను తీసుకుని కిలోమీటర్ల దూరంలో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్లి రోజంతా నిరీక్షించినా పని కాకపోయేది. మళ్లీ మరుసటి రోజు పోయేటోళ్లం. రిజిస్ట్రేషన్ ఖర్చు, తీసుకుపోయే వాళ్ల ఖర్చు తడిసి మోపెడయ్యేది. దీనికి తోడు అంతా అయ్యాక పాసు పుస్తకాలు, కాస్తు కాలమని తదితర పనులకు వీఆర్ఏ, ఆర్ఐ, తహసీల్దార్, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్లం. ‘ధరణి’ వచ్చాకే ఈ కష్టాలన్నీ తప్పినయ్. ఇటువంటి ధరణి పోర్టల్ను తీసేస్తామని ప్రకటిస్తున్న కాంగ్రెస్ మాటలను నమ్మం. అయినా ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేది. రైతులందరూ సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం. మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆరే అవుతారు. కారుగుర్తుకే ఓటు వేస్తం.
-పొగాకు గోపాల్ ముద్విన్ గ్రామం, (కడ్తాల్)
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మస్తు కష్టాలు పడ్డాం. కాస్తు కాలంలో ఒకరి పేరు.. పట్టా పుస్తకంలో ఒకరి పేరు.. ఏకంగా కొన్ని గుంటలు, ఎకరాల కొద్దీ భూమి పక్క పట్టారుల పేరుమీదకు మారితే నానా కష్టాలు పడ్డాం. అటువంటి కాంగ్రెస్ పార్టీని మళ్ల నమ్ముతమా.. అయినా కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేది లేదు.. మేముందుకు ఓటు వేస్తం. సీఎం కేసీఆర్ రైతులను కడుపుల పెట్టుకుని చూసుకుంటుండు. మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆరే కావాలె. ఈసారి కూడా కేసీఆర్ వెంటే ఉంటాం.
– నర్సమ్మ, పెంజర్ల, (కొత్తూరు)
‘ధరణి’ని తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో రెవెన్యూ వ్యవస్థ గందరగోళంగా ఉండేది. రాత్రికి రాత్రే మన పేరు మీద ఉన్న భూమి వేరొకరి పేరుమీదికి ఎక్కేది. ఎంతో మందికి గొడవలు జరిగేవి. ధరణి అమలుల్లోకి వచ్చాక రెవెన్యూ వ్యవస్థ మారింది. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా భూములు పట్టాలవుతున్నయ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు.. వాళ్ల మాటలను జనం నమ్మరు. సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం. ఈసారి కూడా కారుగుర్తుకే ఓటు వేసి గెలిపించుకుంటాం.
-పోతురాజు రాజుగౌడ్, సాహెబ్గూడ(ఆదిబట్ల)