వికారాబాద్, అక్టోబర్ 29, (నమస్తే తెలంగాణ): కొడంగల్లో రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నది. ఓడిపోవడం ఖాయమని తెలుసుకొన్న రేవంత్ అడ్డదారులను ఎంచుకున్నాడు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, నాయకులకు బెదిరింపులు, డబ్బులతో ప్రలోభపెడుతున్నారు. తనకు ఓటేసి గెలిపించమని కొడంగల్ ప్రజలను అడిగేందుకు మొహం లేకపోవడం, ఓటుకు నోటు, నోటుకు టికెట్ వంటి అడ్డదారులు అచ్చొచ్చిన రేవంత్రెడ్డి ప్రజలను కాకుండా ఈ ఎన్నికల్లో డబ్బును నమ్ముకొని ముందుకెళ్తున్నారు. గతంలో ఎప్పుడులేని విధంగా కొడంగల్ అభివృద్ధికి భారీగా నిధులు తీసుకువచ్చి కొడంగల్ రూపురేఖలు మార్చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డి వెంట కొడంగల్ ప్రజలు ఉన్నారని గ్రహించిన రేవంత్ అడ్డదారులకు తెరలేపారు.
బెదిరింపులు, డబ్బులతో పలువురు సర్పంచులను కొనుగోలు చేసేందుకు రేవంత్రెడ్డి అండ్ కో.. కుట్రలు చేస్తున్నారు. ఇప్పటికే మాయమాటలు చెప్పి గుర్నాథ్రెడ్డిని పార్టీలోకి రప్పించుకున్నప్పటికీ సొంతూరులో తప్ప మిగతా ఎక్కడా కూడా గుర్నాథ్రెడ్డి ప్రభావం లేకపోవడం, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ గులాబీ దళం బలంగా ఉండడంతో సర్పంచులను కొనుగోలు చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. గతంలో ఎన్నోఏండ్లుగా తండాల ప్రజలు పడిన కష్టాలు, సమస్యలకు పరిష్కారం చూపిన బీఆర్ఎస్ పార్టీవైపు కొడంగల్ ప్రజల నిలుస్తూ రేవంత్రెడ్డి అండ్ కో.. చేసిన కుట్రలను బయటపెట్టిన గట్టెగానితండా, లోతుకుంటతండా, టేకులగడ్డతండా సర్పంచులు హీరోలుగా నిలిచారు.
తండాల్లో గతంలో గుక్కెడు తాగునీటి కిలోమీటర్ల కొద్ది నడిచివెళ్లిన పరిస్థితులు, వానకాలం వస్తే చాలు రాకపోకలు బంద్ కావడం, సీజనల్ వ్యాధులతో వైద్యం అందుబాటులో లేకపోవడంతో ప్రాణాలు కోల్పోవడం వంటి దయనీయ పరిస్థితుల నుంచి ఇంటి ముందరే నల్లాతో స్వచ్ఛమైన తాగునీరు అందించగా, ప్రతి తండాకూ రోడ్లు, పల్లె దవాఖానలు ఏర్పాటు చేసి నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది రాష్ట్ర సర్కార్. దీంతో గిరిజన సర్పంచులు, నాయకులు, ప్రజలంతా ఏ ఎన్నికలైనా బీఆర్ఎస్కే జై కొడుతామంటున్నారు. అంతేకాకుండా మరికొంత మందిని వివిధ ప్రలోభాలతో పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నా తండాల ప్రజలతోపాటు కొడంగల్లోని సబ్బండ వర్గాల ప్రజల అభ్యున్నతితోపాటు, నియోజవర్గాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకువచ్చి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిన నరేందర్రెడ్డిని మరోసారి గెలిపించుకునేందుకు సిద్ధమయ్యారు.
ఒకప్పుడు అభివృద్ధికి ఆమడదూరంగా ఉన్న కొడంగల్ నియోజకవర్గం ప్రస్తుతం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి స్పీడందుకున్నది. నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడం, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దత్తత తీసుకోవడం, కొడంగల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డి కృషితో ప్రభుత్వం రూ.1500 కోట్లకుపైగా నిధులొచ్చాయి. మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ప్రజారోగ్యం, విద్య, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల పురోగతిని సాధిస్తున్న నియోజకవర్గంగా కొడంగల్ ముందుకు సాగుతున్నది.
సీఎం కేసీఆర్ కోస్గిలో బస్డిపోతోపాటు బస్స్టేషన్ నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చి కోస్గి ప్రజల కలను నెరవేర్చారు. కొడంగల్, కోస్గి మున్సిపాలిటీల అభివృద్ధికిగాను రూ.80కోట్ల నిధులిచ్చారు. రెండు మున్సిపాలిటీల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. సీసీ రోడ్లు, దుకాణ సముదాయాలు, పార్కులు, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దారు. కొడంగల్ మున్సిపాలిటీలో 30 పడకల ప్రభుత్వ దవాఖాన, కోస్గిలో 50 పడకల దవాఖాన, మద్దూరులో 30 పడకల ఆసుపత్రితోపాటు కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చి కొడంగల్ ప్రజలకు ఖరీదైన వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నారు.
బొంరాసుపేట్లో బీసీ గురకుల, కొడంగల్లో మైనార్టీ గురుకుల, మద్దూరులో ఎస్సీ గురుకుల పాఠశాలలను మంజూరు చేసి పేద విద్యార్థులకు ఉచిత నాణ్యమైన విద్యనందిస్తూ ఏటా ఒక్కో విద్యార్థికి రూ.లక్షన్నర చొప్పున ఖర్చు చేస్తున్నది. రూ.4 కోట్లతో కొడంగల్, కోస్గిలో యాదవ భవనాలు, ముదిరాజ్ భవనాలు, అంబేద్కర్ భవన్, రూ.కోటిన్నరతో కొడంగల్లో బంజారాభవన్ను నిర్మించారు. రైతుబంధు కింద ఒక్కో సీజన్కు 91,229 మంది రైతులకు రూ.100.10 కోట్ల చొప్పున ఇప్పటివరకు రూ.1046 కోట్ల పెట్టుబడి సాయాన్ని కొడంగల్ రైతులకు ప్రభుత్వం అందించింది.
రైతుబీమా కింద మృతిచెందిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.82.35కోట్ల సాయాన్ని, కల్యాణలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు 8860 మంది లబ్ధిదారులకు రూ.58కోట్లు, షాదీముబారక్ కింద 1000 మందికి రూ.6.16కోట్లు, ఆసరా పింఛన్లు 37,236 మందికి రూ.9.42 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తూ అండగా నిలుస్తున్నది. కేసీఆర్ కిట్స్ పథకంలో భాగంగా ఇప్పటివరకు 9129 మందికి రూ.11.86కోట్ల విలువగల కిట్లను పంపిణీ చేసింది. మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ పనులకుగాను 299 చెరువులకు రూ.75.66 కోట్లతో చెరువులకు పూర్వవైభవం తీసుకువచ్చి 22వేల ఎకరాలకు చెరువుల ద్వారా సాగునీరిందిస్తున్నారు.
బీఆర్ఎస్ సర్పంచ్లు కాంగ్రెస్లో చేరితే ఒక్కొక్కరికీ రూ.15 లక్షల చొప్పున ఇస్తామని ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన డాక్యానాయక్ మమ్మల్ని ప్రలోభపెట్టాడు. నాతోపాటు టేకులగడ్డతండా, లోతుకుంటతండా సర్పంచ్లకు డబ్బులిస్తానని చెప్పాడు. దీంతో నాతో పాటు టేకులగడ్డతండాకు చెందిన శంకర్నాయక్, లోతుకుంటతండా సర్పంచ్ రవీనాయక్లు కలిసి శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో వడిచెర్ల స్టేజీ వద్దకు వెళ్లాం. అక్కడ డాక్యానాయక్ మాకు డబ్బులిస్తుండగా పోలీసులు వచ్చి పట్టుకున్నారు. మాకు కాంగ్రెస్లో చేరే ఉద్దేశం లేనందునే వారి ప్రలోభాలను ముందే మేము పోలీసులకు చెప్పాం. నాయకుడి స్థాయిని బట్టి కాంగ్రెస్ నాయకులు ధర నిర్ణయించారు. కాంగ్రెస్ దొంగ పనులు, అరాచకాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అభివృద్ధితో బీఆర్ఎస్ ముందుకు వెళ్తున్నది.
– రాథోడ్ నర్సింహానాయక్, గట్టెగానితండా సర్పంచ్ కొడుకు
గట్టెగానితండా సర్పంచ్ కొడుకు నర్సింహానాయక్ మాకు ఫోన్చేసి కాంగ్రెస్ పార్టీలో చేరితే డబ్బులు ఇస్తామని డాక్యానాయక్ చెప్పారని వెళ్దాం రండి అంటే వెళ్లా. వడిచెర్ల గేటు వద్దకు వెళ్లే సమయానికి డాక్యానాయక్ కారులో డబ్బులున్నాయి. కొద్ది నిమిషాల్లోనే పోలీసులు వచ్చి స్వాధీనం చేసుకున్నారు. మేము పార్టీకి అమ్ముడు పోయేవాళ్లం కాదు. నాకు బీఆర్ఎస్ అన్నా, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నా ప్రాణం. పార్టీ కోసం పనిచేస్తాం.
-రవినాయక్, లోతుకుంటతండా సర్పంచ్
మేము పైసలు తీసుకుని పార్టీలు మారే వాళ్లం కాదు. పార్టీ కోసం చావనైనా చస్తాం కానీ అలాంటి పనులు చేయం. మా పార్టీ నుంచి వెళ్లిన డాక్యానాయక్ బీఆర్ఎస్ సర్పంచ్లను కొనడానికి ప్రయత్నాలు చేస్తుండడంతో ఎమ్మెల్యే ఆదేశాలతో ఆయనపై ఓ కన్నేసి ఉంచాం. బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడి పని చేస్తాం. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదు. ఎన్ని డబ్బులు ఇస్తామన్నా కాంగ్రెస్ నాయకులకు లొంగం.
– శంకర్నాయక్, టేకులగడ్డతండా సర్పంచ్ భర్త